‘రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలి’

ABN , First Publish Date - 2022-10-09T05:08:44+05:30 IST

ఓర్వకల్లు పారిశ్రామికవాడకు అందించే నీరును తాగు, సాగునీరుకు అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోరారు.

‘రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలి’

ఓర్వకల్లు, అక్టోబరు 10: ఓర్వకల్లు పారిశ్రామికవాడకు అందించే నీరును తాగు, సాగునీరుకు అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోరారు. శనివారం ఓర్వకల్లులోని ప్రజాసంఘాల కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగన్న అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ పరిశ్రమలకు సౌకర్యార్థం కోసం నిర్మిస్తున్న పైపులైనలో భూములు కోల్పోయిన రైతులకు సెంటుకు రూ.20వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించేదాకా పైపులైన పనులు ప్రారంభించరాదన్నారు. ఈ నీటిని పరిశ్రమలకే కాకుండా హంద్రీనీవా ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తూ గ్రామాలకు తాగునీరు అందించాలన్నారు. పరిశ్రమలకు నీటి సౌకర్యం కల్పించడం మంచిదేనని.. అయితే ఆ పైపులైనలో భూములు కోల్పోయిన రైతులకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకుండా ఏ విధంగా పనులు ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తగిన నష్టపరిహారాన్ని ప్రకటించి పూర్తి స్థాయి పరిహారాన్ని రైతులకు అందజేసి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఓర్వకల్లు మండలంలో పరిశ్రమల హబ్‌కు భూములు కోల్పోయిన గ్రామాలను మినహాయిస్తే.. మండలంలోని మిగిలిన గ్రామాలకు మండలాన్ని ఆనుకుని వెళ్తున్న హంద్రీనీవా నుంచి గ్రామాలకు సాగు,తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అద్యక్షుడు శ్రీధర్‌, రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి మధుసూదన, సుధాకర్‌, ఎల్లరాజు, శివకుమార్‌, రాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-09T05:08:44+05:30 IST