బీసీలను పట్టించుకోని సీఎం: టీడీపీ
ABN , First Publish Date - 2022-12-07T00:21:06+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ బీసీల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 6: ముఖ్యమంత్రి జగన్ బీసీల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీసీలపై ముఖ్యమంత్రి చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని జిల్లా పార్టీ యంత్రాంగం చేపట్టింది. ఇందులో భాగంగా రెండో రోజు బీసీ సెల్ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ప్రాధాన్యమైన పదవులను ముఖ్యమంత్రి జగన్ తన సామాజిక వర్గానికి కేటాయించి, ప్రాధాన్యం లేదని పదవులను బీసీలకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లయినా బీసీ కార్పొరేషన్లకు నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. బీసీల కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని బీసీలంతా జగన్ పాలనలో మాకు ఇదే కర్మ అంటూ బోరున విలపిస్తున్నారని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం గత టీడీపీ హయాంలో రూ.34వేల కోట్లను ఖర్చు చేశారని సత్రం రామకృష్ణుడు అన్నారు. స్థానిక సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లను కోత పెట్టి 16,800 మంది బీసీలకు పదవులు లేకుండా దగా చేయడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని, ఏ మొహం పెట్టుకుని జయహో బీసీలంటూ సభ పెడుతున్నారంటూ సోమిశెట్టి జగన్ను ప్రశ్నించారు. నంది మధు, తిరుపాలు బాబు, రామాంజినేయులు, జేమ్స్, బాబురావు, ఆశాలత, పరమేష్, విజయలక్ష్మి, ఎల్లాగౌడు, కిట్టు, రాజశేఖర్ నాయుడు, రాజ్యలక్ష్మి, నరసింహులు, రామక్రిష్ణ, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.