క్లాప్...ఫ్లాప్
ABN , First Publish Date - 2022-08-04T04:10:29+05:30 IST
చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేయాలనే సంకల్పం గొప్పదే. చెత్త కూడా నిరుపయోగం కాదని ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
- అడ్రస్ లేని క్లీన ఆంధ్రప్రదేశ మొదలు కాని చెత్త నుంచి సంపద వృద్ధి కేంద్రాలు
- చెత్త బుట్ట దాఖలైన పథకం
ఆళ్లగడ్డ: చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేయాలనే సంకల్పం గొప్పదే. చెత్త కూడా నిరుపయోగం కాదని ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పైగా చెత్తను ఒక పద్ధతి ప్రకారం పోగు చేస్తే స్వచ్ఛత కూడా సాధించినట్లవుతుంది. కానీ క్లీన ఏపీ జగనన్న స్వచ్ఛ సంకల్పం ఆచరణలో విఫలమైంది. చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీనికి ఆది నుంచి ఆటంకాలు ఏర్పడుతునే ఉన్నాయి. ఇటీవల ఇంటింటి చెత్తను సేకరించి దాన్ని తడి, పొడి, ప్రమాదకర చెత్తగా వేరు చేసి విక్రయించి ఆదాయం పొందే ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చెత్తను వేరు చేసేందుకు దాదాపు రూ. 40 లక్షలు వెచ్చించి మూడు వేర్వేరు రంగులున్న 45 వేల చెత్త బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేదు. క్లాప్ పథకం కింద ఆళ్లగడ్డ మున్సిపాల్టీ పరిధిలోని వార్డుల్లో చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇది ప్రారంభమై నాల్గు నెలలు పూర్తైనా ప్రజలు వాటిని వినియోగించడం లేదు. అధికారులు వాటిని వాడాలని ఒత్తిడి చేయక పోవడం గమనార్హం. దీంతో ఈ డబ్బాలు చాలా ఇళ్లలో ఆటకెక్కాయి. మూడు రంగుల డబ్బాలు ఎందుకు ఇచ్చారు? ఎలా ఉపయోగించాలి, ఏ రంగు డబ్బాలో ఏమి వేయాలి? తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వదిలేశారు. అంతకుమించి క్లాప్ సాధించిందేమీ లేదు.
కంపోస్టు యార్డు ఉన్నా. . .
మున్సిపాల్టీ పరిధిలోని పి. నాగిరెడ్డిపల్లె వద్ద 5.60 ఎకరాల విస్తీర్ణంలో 2018లో దాదాపు రూ.40 లక్షలతో స్థలాన్ని కొనుగొలు చేసి కంపోస్టు యార్డు ఏర్పాటు చేశారు. దాదాపు 100 టన్నుల చెత్త నుంచి 200 టన్నుల ఎరువుగా మార్చి విక్రయించారు. ఇది ఆరంభ శూరత్వమే. గత 22 నెలలుగా యార్డుకు చెత్త తరలింపు ఆగిపోయింది. పట్టణంలో సేకరించిన చెత్తను రాళ్ల గనుల్లో వేస్తూ నీటి కాలుష్యానికి కారణం అవవుతున్నారు.
ఏవి గార్చేజ్ ట్రాన్స పోర్టు స్టేషన్లు
క్లాప్ పథకంలో ప్రతి 10 వార్డులకు ఒక గార్బేజ్ ట్రాన్సపోర్టు స్టేషన (చెత్తను తరలించే కేంద్రాలు) ఏర్పాటు చేయాలి. ఆళ్లగడ్డలో మూడు జీటీఎస్ కేంద్రాలకు గాను ఒక్కటి కూడా నిర్మాణ పనులను ప్రారంభించలేదు. అటు చెత్తను వేరు చేయించక పోగా, ఇటు జీటిఎ్సలను నిర్మించక, మరో వైపు అందుబాటులో ఉన్న కంపోస్టు యార్డును సద్వినియోగం చేసుకోకుండా క్లీన ఏపీ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తారో ఆ అధికారులకే తెలియాలి.
మున్సిపాల్టీలో చెత్త సేకరణ వివరాలు
పట్టణంలో 14,300 నివాసాలుండగా 27 వార్డుల్లో 50 వేలు జనాభా ఉంది. ప్రతి రోజు 8 నుంచి10 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది.
చెత్తను సంపదగా మారుస్తాం
క్లాప్ పథకాన్ని విజయవంతం చేస్తాం. ఇప్పటికే చెత్త డబ్బాలను పంపిణీ చేశాం. చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. కంపోస్టు యార్డుకు ప్రహరీ లేక పోవడంతో సమస్యగా మారింది. దాని నిర్మాణానికి చర్యలు తీసుసుంటున్నాం. చెత్త తరలింపు కేంద్రాల నిర్మాణంలో గుత్తేదారులు పనులు చేసేందుకు అనుమతి ఇస్తున్నాం. పనులు త్వరలో ప్రారంభం అవుతాయి.
: రమే్షబాబు, కమీషనర్