రమణీయం.. రథోత్సవం
ABN , First Publish Date - 2022-05-23T05:52:23+05:30 IST
పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతరలో భాగంగా వెండి మహారథోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది.
అవ్వను దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వచ్చిన జనం
ఆదోని, మే 22: పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతరలో భాగంగా వెండి మహారథోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. బ్రాహ్మణవీధి నుంచి ప్రారంభమైన రథోత్సవం హావన్నపేట కూడలి, బుడేకల్ సర్కిల్, పూల బజార్, షరాఫ్బజార్ మీదుగా సాగి.. యఽథాస్థానానికి చేరుకోవడంతో ఉత్సవం ముగిసింది. ఆరాధన, జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని మహాయోగి లక్ష్మమ్మవ్వ, మూలబృందావనానికి ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉదయం 5 గంటలకే అవ్వను దర్శించుకుని మోక్షప్రాప్తి పొందేందుకు జిల్లా నలమూలల నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన జంటలు అమ్మవారి కలశం చూసేందుకు తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు సాగాయి. మాజీ మంత్రి కోట్ల్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మదిరె భాస్కర్ రెడ్డి, దేవేంద్రప్ప, గుడెసె శ్రీరాములు, దేవిశెట్టిప్రకాష్, తదితర ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ముందుగా లక్ష్మమ్మవ్వ పుట్టినిల్లు మూసానపల్లి గ్రామం నుంచి భజనలతో ఆలయానికి చేరుకున్నాయి. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని డీఎస్పీ వినోద్ కుమార్ ప్రారంభించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు విక్రమసింహ, గుణశేఖర్, ఎస్ఐలు చంద్ర, సునీల్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.