న్యాయం జరగలేదని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-12-07T01:17:10+05:30 IST
పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వైసీపీ నాయకుల కక్ష పూరిత చర్యలు
టీడీపీ అభిమానులన్న కారణంతో కొట్టం కూల్చివేత
పోలీసులు పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగిన వైనం
ఆదోని రూరల్, డిసెంబరు 6: పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళ్తే.. బైచిగేరికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మమ్మ, తిమ్మన్నలకు రాజు, రామాంజి, తిరుమల సంతానం. రాము, రామాంజిలు తెలుగుదేశం పార్టీ అభిమానులు. వీరు ఊరికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న సొంత పొలాల్లో కొట్టం వేసుకొని అక్కడే ఉంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే 2014లో పట్టా పొందిన ప్రభుత్వ స్థలంలో కొట్టం వేసుకొని ఉంటున్నారు. మరో కుమారుడు తిమ్మన్న గ్రామంలోనే వేరే ఇంట్లో ఉంటున్నాడు. రాము, రామాంజిలు టీడీపీ అభిమానులు కావడంతో వైసీపీ నాయకులు ఈ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇందులోభాగంగానే వృద్ధులు ఉంటున్న ఆ కొట్టం సచివాలయానికి అడ్డంగా ఉందని ఆదివారం ఎక్స్కవేటర్తో కూల్చి వేయించారు. ఈ విషయం తెలిసి పెద్ద కుమారుడు రాజు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. దీంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. తాము టీడీపీ అభిమానులం కాబట్టే కక్ష కట్టారని బాధితుడు రాజు తెలిపాడు. అదే స్థలంలో కొట్టాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని వృద్ధురాలు లక్ష్మమ్మ బోరుమని విలపించింది.