అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2022-12-31T00:32:54+05:30 IST
నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి వెల్లడించారు.
ఎస్పీ రఘువీర్రెడ్డి
నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 30 : నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి వెల్లడించారు. అదనపు ఎస్పీ రమణ, నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి, డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, నంద్యాల తాలూకా అర్బన్ సీఐ మురళీమోహన్రావు, నందికొట్కూరు సీఐ విజయభాస్కర్, నంద్యాల సీసీఎస్ సీఐ రామకృష్ణ, సిబ్బంది ఈ కేసులను ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన గుత్తికొండ పవన్కుమార్ అలియాస్ కార్తీక్ అలియాస్ నాని, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వేముల శివశంకర్ అలియాస్ రాజు, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంకు చెందిన తలారి మారెన్నలను అవుకు, బనగానపల్లె ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 1.13కేజీల బంగారు నగలు, రూ.5.75లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ముగ్గురి దొంగలపై నంద్యాల జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, కడప జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో ఒక చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన కోటయ్య, చిన్న నరసింహులు, రాములమ్మ నందికొట్కూరు పరిసరాల్లో సంచరిస్తుండగా అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 70గ్రాముల బంగారు నగలు, 300గ్రాముల వెండి, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నంద్యాల తాలూకా, దొర్నిపాడులో చోరీలకు పాల్పడిన నంద్యాల జిల్లా రుద్రవరం మండలానికి చెందిన మాధవకృష్ణ, నంద్యాల పట్టణం టెక్కె వీధికి చెందిన రాజేష్, రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బత్తులూరు రామచంద్రుడు, దొర్నిపాడుకు చెందిన పెద్ద హుసేన్, బాలయ్యలను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 100.05 గ్రాముల బంగారు, 3బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.