ప్రశాంతంగా ఏపీఈఏపీ సెట్
ABN , First Publish Date - 2022-07-05T06:05:17+05:30 IST
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీ సెట్-2022 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా ముగిసింది.
ఉమ్మడి జిల్లాలో 94.28 శాతం హాజరు
కర్నూలు(ఎడ్యుకేషన్), జూలై 4: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీ సెట్-2022 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 2,276 మంది రిజిస్టర్ చేసుకోగా.. 2,146 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 139 మంది గైర్హాజరయ్యారు. 94.28 శాతం హాజరు నమోదైంది. కర్నూలు నగరంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో 1,518 మందికి గాను... 1,434 మంది (94.47 శాతం) హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 758 మంది నమోదు చేసుకోగా.. 712 మంది (93.93 శాతం) హాజరయ్యారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు పట్టణాల్లో మొత్తం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో సరైన వాహన సౌకర్యాలు లేక అభ్యర్థులు, బంధువులు ఇబ్బందులు పడ్డారు. సకాలంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ఆటోడ్రైవర్లు నాలుగింతల అదనపు చార్జీలను వసూలు చేశారు. జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి చెందిన అభ్యర్థులు హాల్ టికెట్ను సరిగా చూసుకోకపోవడంతో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లారు. ఆ కేంద్రం కాదని తెలియడంతో పరుగులు తీశారు. ‘ఒక నిమిషం’ నిబంధన కారణంగా రెండు గంటల ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.