భక్తుల చెంతకు అహోబిలేశుడు
ABN , First Publish Date - 2022-01-17T05:43:36+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి సంక్రాంతి పర్వదినాన భక్తుల చెంతకు బయలు దేరింది. అంతకు మునుపు స్వామివారికి వేద పండితులు అన్నకూటోత్సవం, మహాకుంభ హారతి నిర్వహించారు.
పార్వేట పల్లకి మహోత్సవం ప్రారంభం
ఆళ్లగడ్డ, జనవరి 16: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి సంక్రాంతి పర్వదినాన భక్తుల చెంతకు బయలు దేరింది. అంతకు మునుపు స్వామివారికి వేద పండితులు అన్నకూటోత్సవం, మహాకుంభ హారతి నిర్వహించారు. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని గుడికట్టుదారులకు, గ్రామ సేవకులకు, స్వామి సేవకులకు పంచిపెట్టారు. స్వామి వారి ఉత్సవ పల్లకి 40 రోజుల పాటు 33 గ్రామాల్లో పర్యటిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి ఊరూరా తిరిగి తన కల్యాణానికి భక్తులను ఆహ్వానిస్తారు. పార్వేటను ఈవో నరసయ్య, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, వేదపండితులు ప్రారంభించారు.