విశాఖపట్నానికి వెన్నెల ఏసీ స్లీపర్
ABN , First Publish Date - 2022-10-12T06:04:39+05:30 IST
విశాఖపట్నానికి వెన్నెల ఏసీ స్లీపర్
కొత్త బస్సును ప్రారంభించిన ఆర్టీసీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ అధికారులు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సును కొత్తగా ప్రవేశపెట్టారు. విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, జోనల్ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ నూతన స్లీపర్ సర్వీసు రోజూ రాత్రి 11 గంటలకు పీఎన్బీఎస్ నుంచి బయల్దేరుతుంది. బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట సెంటర్, ఆటోనగర్ టెర్మినల్, కామయ్యతోపు సెంటర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వరకు వెళ్లి 100 అడుగుల రోడ్డు నుంచి కామినేని హాస్పిటల్ మీదుగా ఎనికేపాడు, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఉదయం 6 గంటలకు విశాఖ చేరుతుంది. మార్గంమధ్యలో రాజమండ్రి, అన్నవరంలో మాత్రమే ఆగుతుంది. విశాఖపట్నం వరకు చార్జీ రూ.1,220, అన్నవరానికి రూ.820గా నిర్ణయించారు. ఈ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్ఎం) ఎం.యేసుదానం, డీసీటీఎం ఏ.జాన్ సుధాకర్, ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్, విజయవాడ ఇన్చార్జి డిపో మేనేజర్ ఆంజనేయులు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.