AP News: మాట తప్పం, మడం తిప్పం అన్న జగన్.. ఎందుకు మాట తప్పారు?: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-25T19:40:15+05:30 IST

మాట తప్పం, మడం తిప్పం అని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు మాట తప్పారని తులసిరెడ్డి ప్రశ్నించారు.

AP News: మాట తప్పం, మడం తిప్పం అన్న జగన్.. ఎందుకు మాట తప్పారు?: తులసిరెడ్డి

విజయవాడ (Vijayawada): జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి (Narreddy Tulasi Reddy) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మద్యం నిషేధిస్తామని నవరత్నాల్లో ఒకటిగా చేర్చారని, మేనిఫెస్టో భగవద్గీత (Bhagavad Gita), బైబిల్ (Bible), ఖురాన్ (Quran) అని మాటలు చెప్పారని, మాట తప్పం, మడం తిప్పం అని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. మద్యంపై వ్యక్తిగత ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారని, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మద్యం మత్తులో యువకులు హిజ్రాలపై అత్యాచార యత్నం చేశారని, మానవ సంబంధాలు చేడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని లేదా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.


విద్యార్థులకు మేనమామ అని చెప్పుకునే జగన్, వారి పాలిట కంస మామ అయ్యారని నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక నేటికీ పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలకు కూడా తామే పంపిణీ చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తోందన్నారు. ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపమని ఆడిగారంటే, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-25T19:40:15+05:30 IST