భూముల రీ సర్వే చరిత్రాత్మకం
ABN , First Publish Date - 2022-08-11T06:28:58+05:30 IST
భూముల రీ సర్వే చరిత్రాత్మకం
విజయవాడ(వన్టౌన్), ఆగస్టు 10: భూముల రీసర్వే చరిత్రాత్మకమని, పారదర్శకం, జవాబుదారితనం, అవినీతి రహితంగా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో వైస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష రీ సర్వే కార్యక్రమంపై బుధవారం ఒక రోజు వర్క్షాప్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వర్క్షాప్లో పాల్గొన్న అధి కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రూ.140 కోట్లతో వందేళ్ల తరువాత ఆధునిక పరికరాలతో భూసర్వే నిర్వహిస్తున్నారని, పూర్తి వివరాలతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రీ సర్వే అనంతరం పక్కా వివరాలతో హక్కుదారుడికి పత్రాలు అంద జేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే పూర్తయిందని, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాలు, రోడ్లను వేరువేరుగా సర్వే చేస్తారన్నారు. సర్వేలో అనుభవమున్న సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి తెలిపారు. మునిపిపల్ పరిపాలన శాఖ కమిషనర్, సంచాలకుడు ప్రవీణ్కుమార్, అదనపు సీసీఎల్ఏ కార్యదర్శి బాబు.ఎ, పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఆర్జే విద్యుల్లత, విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు.