సంక్షోభంలో వ్యవసాయ రంగం

ABN , First Publish Date - 2022-06-12T06:02:22+05:30 IST

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

 విజయవాడ పార్లమెంట్‌ తెలుగురైతు కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా

నందిగామ, జూన్‌ 11: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ పార్లమెంట్‌ తెలుగురైతు కార్యవర్గ సమావేశం శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని  ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సాగునీరు అందించడం వంటి అంశాల్లో విఫలమైందన్నారు. రైతులకు ఇవ్వాలన్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీలు, యంత్ర పరికరాలు అందజేయలేదన్నారు. ఆధునిక వ్యవసాయం వైపు రైతులను అడుగులు వేయించకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారా కమిషన్‌ వ్యాపారం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి నెలకొన్నదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా సొమ్ము చెల్లించకపోవడం హేయమన్నారు. రైతులకు సున్నా వడ్డీ, ధరల స్థిరీకరణ నిధి ఏమైయ్యా యని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టడం ఈ ప్రభుత్వానికి చేతగావడం లేదని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనను పారదోలేందుకు రైతులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, తదితరులు పాల్గొన్నారు. 


వైసీపీ పని అయిపోయింది : ఉమా 

గొల్లపూడి : రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదును ప్రారంభించారు.  నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు, చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. నేతలు నర్రా వాసు, వడ్లమూడి చలపతిరావవు, ధరావతు శ్రీను నాయక్‌, ఆలూరి హరికృష్ణ చౌదరి (చిన్నా),  ఇరుగుల దిలీప్‌ కుమార్‌, జగదీష్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-12T06:02:22+05:30 IST