బొమ్ములూరులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-28T05:51:42+05:30 IST
బొమ్ములూరులో ఉద్రిక్తత

టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణుల దాడి
గుడివాడ, జూన్ 27 : బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వేయడంపై సోమవారం తీవ్రస్థాయిలో దుమారం రేగింది. రంగులు వేయడానికి ప్రయత్నించిన వైసీపీ నాయకులను రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ అడ్డుకున్నారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి కొడాలి నానీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తను వైసీపీ నాయకులు చితకబాదారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కృష్ణాజిల్లా మహానాడులో భాగంగా జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విగ్రహానికి పూలమాల వేయనున్నారన్న సమాచారంతో కవ్వింపు చర్యల్లో భాగంగానే వైసీపీ శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు టీడీపీ సీనియర్ నాయకుడు, డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ క్షీరాభిషేకం చేశారు. శివరామకృష్ణ గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాడు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పదేళ్లుగా ఏనాడూ కవ్వింపు చర్యలకు పాల్పడని వైసీపీ శ్రేణులు మహానాడు ముంగిట ఇలా చేయడాన్ని టీడీపీ నాయకులు ఖండించారు.