BT Naidu: వైసీపీ గూండాల దుశ్చర్యలను జగన్ రెడ్డి సమర్థిస్తారా?...
ABN , First Publish Date - 2022-11-20T13:04:33+05:30 IST
అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై జగన్ స్వామ్యం రాజ్యమేలుతోందని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటీ నాయుడు విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై జగన్ స్వామ్యం రాజ్యమేలుతోందని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటీ నాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గళాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో కర్నూలులో అభివృద్ధి శూన్యమని.. దీన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబుపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. బెంజి మంత్రి అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలను ప్రశ్నించినందుకు దాడి చేశారన్నారు. చంద్రబాబు కాన్వాయ్పై ఈగ వాలినా.. తాడేపల్లి ప్యాలెస్ బద్దలౌతుందన్నారు.
చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక చంద్రబాబుపై దాడి చేశారని, వైసీపీ గూండాల దుశ్చర్యలను సీఎం జగన్ రెడ్డి సమర్థిస్తారా? అని బీటీ నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై డీజీపీ ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ పూర్తిగా కనుమరుగైందని, ‘రూల్ ఆఫ్ లా’ ఉంటే.. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని బీటీ నాయుడు డిమాండ్ చేశారు.