ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో పోరాడతాం

ABN , First Publish Date - 2022-08-17T06:15:24+05:30 IST

వైసీపీ కార్పొరేటర్లకు విగ్రహాలపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదని, నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎన్‌.బాలస్వామి విమర్శించారు.

ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో పోరాడతాం

వైసీపీ నేతలకు విగ్రహాలపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదు : వీఎంసీ టీడీపీ ఫోర్ల్‌లీడర్‌ బాలస్వామి

విద్యాధరపురం, ఆగస్టు 16 : వైసీపీ కార్పొరేటర్లకు విగ్రహాలపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదని, నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎన్‌.బాలస్వామి విమర్శించారు. మంగళవారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన టీడీపీ కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో ప్రజా సమస్యలపై టీడీపీ కౌన్సిల్‌లో పోరాడుతుందన్నారు. కౌన్సిల్‌లో లోకల్‌ నేతల విగ్రహాలు పెట్టడానికి ప్రాతిపదనలు తెచ్చిన వైసీపీ నేతలు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు మర్చిపోయారన్నారు. నగరం ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. పెన్షన్లపై భారీ కోత, విపరీతంగా పెరిగిన కరెంటు చార్జీలతో ఇబ్బందులు పడుతుంటే వైసీపీ కార్పొరేటర్లు సిగ్గు లేకుండా విగ్రహాలు పెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. విగ్రహాల ఏర్పాటును సుప్రీం కోర్టు నిషేధించిందని, అయినా వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని చిన్నపనులకు టెండర్‌ పిలిచినా ఏ కాంట్రాక్టర్‌ పాల్గొనడం లేదని, ఇంతకంటే దౌర్భాగమైన పరిస్థితి ఎక్కడా లేదన్నారు. వర్షాకాలంలో చాలా మంది ప్రజలు డెంగ్యూ, మలేరియా, దోమకాటుతో ఆసుపత్రుల పాలవుతున్నారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పొతున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం దోమల నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించి, అర్హులందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందచేయాలని, దోమకాటుతో వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వైరల్‌ వ్యాధులకు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), పొట్లూరి సాయిబాబు, దేవినేని అపర్ణ, చెన్నగిరి రామమోహనరావు, వల్లభనేని రాజేశ్వరి, చెన్నుపాటి క్రాంతి, వీరమాచినేని లలిత పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T06:15:24+05:30 IST