భగభగలు
ABN , First Publish Date - 2022-03-05T05:59:46+05:30 IST
భగభగలు
నిప్పులు చెరుగుతున్న భానుడు
ఈనెల ఆరంభం నుంచి ఒకటే సెగ
సాధారణ స్థితిని దాటుతున్న ఉష్ణోగ్రతలు
మరో వారం ఇంతే..
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : మార్చి మొదటి వారంలోనే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిని దాటి నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది, పది గంటలకే ఎండ ప్రచండమవుతోంది. మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని వాతావారణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మహాశివరాత్రికి ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయి. అటువంటిది ఈసారి మహాశివరాత్రికి ముందు నుంచే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. శ్రీలంక-చెన్నై తీరంలో ఏర్పడిన అల్పపీడనమే దీనికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి మార్చి చివరి నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండుతాయి. గడిచిన కొద్దిరోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో వారం పాటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య నమోదు కావచ్చంటున్నారు.
ఏప్రిల్, మేలో వడగాల్పులు లేనట్టేనా..
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనికి వీక్ లానినో కారణమని పేర్కొంటున్నారు. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి వడగాల్పులు వీస్తాయి. వీక్ లానినో కారణంగా అలాంటి పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఈ వడగాల్పులు ఉత్తరాంధ్రలో మాత్రమే ఉంటాయంటున్నారు.