సైన్స్ జీవన ప్రగతికి ఆధారం
ABN , First Publish Date - 2022-12-12T00:32:20+05:30 IST
సైన్స్ జీవన ప్రగతికి ఆధారమని న్యూరాలజిస్ట్ చేకూరి మురళి అన్నారు.
సైన్స్ జీవన ప్రగతికి ఆధారం
న్యూరాలజిస్ట్ చేకూరి మురళి
విద్యాధరపురం,డిసెంబరు 11: సైన్స్ జీవన ప్రగతికి ఆధారమని న్యూరాలజిస్ట్ చేకూరి మురళి అన్నారు. ఆదివారం భవానీపురంలోని నేతాజీ హైస్కూల్లో జరిగిన చెకుముకి జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందచేసిన ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి సైన్స్పట్ల అవగాహన ఉండాలన్నారు. జనవిజ్ఞానవేదిక ప్రధాన కార్యదర్శి ఎల్ గంగాధరరావు మాట్లాడుతూ, నాలుగు దశల్లో నిర్వహించే టెస్టులలో ప్రస్తుతం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రెండు టీములు జనవరి మొదటి వారంలో కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జనవిజ్జాన వేదిక నగర అధ్యక్షుడు వి శివప్రసాద్ అధ్యక్షత వహించారు. ఏ మోహనరెడ్డి, వెలగా శ్రీనివాస్, ఎస్కే ఇమామ్, పీఆర్కే రెడ్డి, వి మురళీమోహన్, మల్లిఖార్జునరెడ్డి, నేతాజీ హైస్కూల్ అధినేత కె తిరుపతిరెడ్డి, గాంధీ ఫౌండేషన్ నాయకురాలు శివరంజని తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో విజయవాడ అమలీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్ధులు ఏ నవీన్ ఆదర్శ్, సీహెచ్ వాత్సల్య, పి తేజరెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కంభంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు చెన్ను శ్యామ్ కృష్ణ, చిమట అనిల్కుమార్, జి రాకేష్లు ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో మైలవరం గౌతమ్ ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ద్వితీయ, కొండపల్లి నాగార్జున హైస్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతి పొందారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏ కొండూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ, విజయవాడ జీడీఈటీ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతి పొందారు.