రోడ్డు మార్జిన్ కోసం రైతుల పొలంలో మట్టి తవ్వకం!
ABN , First Publish Date - 2022-07-01T05:48:02+05:30 IST
వ్యవసాయ భూముల్లోని మట్టిని తవ్వి రోడ్డు మార్జిన్ వేయడంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.
కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వ్యవసాయ భూముల్లోని మట్టిని తవ్వి రోడ్డు మార్జిన్ వేయడంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. స్థానిక రైతు పుప్పాల మనోహరబాబుతోపాటు మరికొంత మంది రైతులు జూన్ 21వ తేదీన మైనింగ్ అధికారులకుఫిర్యాదు చేశారు. గూడూరు మండలం ఆకులమన్నాడు, పర్ణశాల, తుమ్మలపాలెం గూడూరు మీదుగా పెడన వరకు రూ.9.20 కోట్లతో రోడ్డు వేసేందుకు 2021 జూలై 20వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులను పూర్తి చేసిన కాంట్రాక్టరు రోడ్డు మార్జిన్ వేసేందుకు వేరే ప్రాంతం నుంచి మట్టిని తీసుకురాకుండా పక్కన ఉన్న రైతుల భూముల్లో మట్టిని తవ్వి వేయడం వివాదాస్పదమైంది. రైతులు ఈ విషయంపై ప్రశ్నించడంతో స్థానిక సర్పంచ్ భర్త ఒక రైతును పోలీస్స్టేషన్కు తరలించి ఒక రోజంతా గూడూరు పోలీ్సస్లేషన్లో ఉండేలా చేసి, బెదిరింపులకు గురిచేశాడని రైతులు వాపోతున్నారు. మట్టి తవ్వడంతో పొలాలను దమ్ము చేసేందుకు ట్రాక్టర్లు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూమిలో మట్టి తవ్విన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.