నెత్తురోడ్డుతూ..
ABN , First Publish Date - 2022-12-31T01:10:06+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.
నేర గణాంక వార్షిక వివరాల్లో సీపీ కాంతిరాణా
విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. 2022వ సంవత్సరం నేర గణాంక వార్షిక వివరాలను పోలీస్ కమిషనర్ టి.కాంతిరాణా శుక్రవారం వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో డీసీపీలు విశాల్గున్నీ, కంచి శ్రీనివాసరావు, మోకా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
గడిచిన ఏడాది 1,133 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఈ ఏడాది ఆ సంఖ్య 1,360కి పెరిగింది.
ఈ ఏడాది 1,876 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వారిలో 623 మందికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.
2021లో 146 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 159కి చేరింది.
ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ కేసులు 97 వరకు నమోదయ్యాయి. వాటిల్లో 70 శాతం కేసుల్లో చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ ఏడాది పోలీసులకు ప్రజల నుంచి అందే ఫిర్యాదులు తగ్గాయి. గడిచిన ఏడాది 17,174 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది 15,329కు దిగజారాయి.
గడిచిన ఏడాది మొత్తం 238 చోరీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 217 కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది 22 శాతం వరకు హత్య కేసులు తగ్గాయి. గడిచిన ఏడాది కమిషనరేట్ పరిధిలో 49 హత్యలు జరగ్గా, ఈ ఏడాది ఆ సంఖ్య 41 వద్ద ఆగింది.
గడిచిన ఏడాది భౌతిక దాడులకు సంబంధించి 131 కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య ఈ ఏడాది 100కి తగ్గింది.
ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 911 కేసులు నమోదయ్యాయి. 79 ఫోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి 46 కేసులు నమోదయ్యాయి. ప్రేమ, పెళ్లి మాటలతో మభ్యపెట్టి అత్యాచారం చేసిన కేసులు 36. ఈ కేసుల్లో 71 శాతం వరకు న్యాయస్థానాల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు.
ఈ ఏడాది 103 గంజాయి కేసులు నమోదయ్యాయి. వాటిలో 205 మందిని అరెస్టు చేసి రూ.38.25 లక్షల విలువైన 765 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 210 గుట్కా కేసులు నమోదు చేసి 226 మందిని అరెస్టు చేసి రూ.27.89 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 1992 నుంచి 742 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22.5 వేల కిలోల గంజాయిని దహనం చేశారు. దీని విలువ రూ.9 కోట్లు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణాలో 1,757 మందిని అరెస్టు చేసి, 1,685 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.69.32 లక్షల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి 4,362 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.15 కోట్ల విలువైన 5.18 లక్షల మద్యం సీసాలను ధ్వంసం చేశారు.
ఐదుగురు రౌడీషీటర్లను నగరం నుంచి బహిష్కరించారు.
సారా తయారీ, నల్ల బెల్లం అమ్మకందారులపై 678 కేసుల్లో 2,087 మందిని బైండోవర్ చేశారు.
లోక్ అదాలత్లో ఈ ఏడాది 14,703 కేసులను పరిష్కరించారు.