మాదకద్రవ్యాలతో సమాజానికి చేటు
ABN , First Publish Date - 2022-06-27T06:36:03+05:30 IST
సమాజానికి చేటుగా పరిణమించిన మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని ఏఎస్పీ పి.వెంకట రామాంజనేయులు పిలుపునిచ్చారు.

మచిలీపట్నం టౌన్, జూన్ 26 : సమాజానికి చేటుగా పరిణమించిన మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని ఏఎస్పీ పి.వెంకట రామాంజనేయులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కోర్టుసెంటర్ నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్పెషల్ ఎన్పోర్సుమెంట్, వైద్య, వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక, రెవెన్యూ, పోలీ సు శాఖ అధికారులు, వైద్యులు, నర్శులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జి ల్లా పోలీసు శాఖ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఏఎస్పీ పి.వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వ్యసనం వల్ల యువత జీవితాలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. సమాజాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం పెనుఅవరోధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలోని డి ఎడిక్షన్ సెంటర్కు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాభాయి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ హస్మా పర్హిన్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్వీడీ ప్రసాద్, ట్రైనింగ్ ఎస్పీ జగదీష్, మునిసిపల్ కమిషనర్ జి.చంద్రయ్య, టౌన్ డీఎస్పీ మాసూంబాషా, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజీ, దిశ డీఎస్పీ రాజీవ్కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
