మత్తుకు బానిసైతే భవిష్యత్ చిత్తే
ABN , First Publish Date - 2022-08-19T07:00:34+05:30 IST
మత్తుకు బానిసైతే భవిష్యత్ చిత్తే
వన్టౌన్, ఆగస్టు 18: మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని, భవిష్యత్ చిత్తవుతుందని, చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు అన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మత్తుకు నో చెప్పండి..హలో యువత మేలుకో.. చెడు వ్యసనాల నుంచి నిన్ను నీవు కాపాడుకో అంటూ నినాదాలతో ముద్రించిన వాల్పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్క రించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలతో పాటు సమాజహితం కోరే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థా లకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, కార ్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లెనిన్ బాబు, షేక్ సుభాని, బాబి, సుబ్బారావు, లంకా గోవిందరాజులు, లంకె సాయి, ఓబులేశు, రాకేష్ పాల్గొన్నారు.