జంక్షన్లో నీరాజనం
ABN , First Publish Date - 2022-03-05T05:57:24+05:30 IST
జంక్షన్లో నీరాజనం
టీడీపీ అధినేత చంద్రబాబుకు అపూర్వ స్వాగతం
తెలుగు రైతు వర్క్షాపులో కార్యకర్తలకు దిశానిర్దేశం
చలోక్తులతో కూడిన ప్రసంగాలతో తమ్ముళ్లలో ఉత్సాహం
హనుమాన్ జంక్షన్/రూరల్, మార్చి 4 : తెలుగు రైతులు ఒక్కటై కదిలారు. తెలుగు రైతు సదస్సును దిగ్విజయం చేశారు. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లోని ఎస్ఆర్ కన్వెన్షన్లో ‘రైతు గెలవాలి - వ్యవసాయం నిలవాలి’ నినాదంతో మూడు రోజులు నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాపు ముగింపు సభకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. అధినేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. టీడీపీ గన్నవరం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో రామవరప్పాడు నుంచి హనుమాన్ జంక్షన్ వరకూ చంద్రబాబును ఊరేగింపుగా తీసుకొచ్చారు. హనుమాన్జంక్షన్లో తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమావరప్రసాదరావు, టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కలపాల సూర్యం, మండాది రవీంద్ర, వడ్డిల్లీ లక్ష్మి తదితరులు కండువా కప్పి స్వాగతించారు. కాగా, అభిమానులు ఎగబడటంతో ఒకింత తొక్కిసలాట జరిగింది. చంద్రబాబును ఎడ్లబండిపై ఎక్కించుకుని సభ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిర్చిపైరును మాజీ మంత్రి నెట్టెం రఘురాం చంద్రబాబుకు చూపించారు. మూడు రోజుల వర్క్షాపులో జరిగిన అంశాలను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొన కళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు బందోబస్తు నిర్వహించారు.