జీపీఎస్ కాల్వ స్లూయిజ్ పటిష్టతకు చర్యలు
ABN , First Publish Date - 2022-07-05T06:54:35+05:30 IST
జీపీఎస్ కాల్వ స్లూయిజ్ పటిష్టతకు చర్యలు

విజయవాడ రూరల్, జూలై 4 : ఎట్టకేలకు గొల్లపూడి ఎత్తిపోతల పథకం (జీపీ ఎస్) కాల్వకు నీటిని విడుదల చేసేం దుకు కసరత్తు జరుగుతోంది. పగుళ్లిచ్చిన జీపీఎస్ కాల్వ స్లూయిజ్ గోడను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టారు. స్లూయిజ్ గోడకు తన్నుడుగా రబ్బీ్షను పోస్తున్నారు. ఆ తర్వాత గోడకు ఇసుక కట్టలను తన్నుడుగా ఉంచనున్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహకారంతో రూ.3 లక్షల వ్యయంతో ఈ పనులను సోమవారం చేపట్టారు. అంబాపురం సమీపంలోని పాములకాల్వ వద్ద జీపీఎస్ కాల్వ స్లూయిజ్ గోడ పగుళ్లివడంతో ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి సంస్థ (ఐడీసీ) అధికారులు స్లూయిజ్ మరమ్మతులకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపించినా, అనుమతులు రాలేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభవ్వగా, రైతులు పొలాల్లో దుక్కులు దున్నుకుని నీటికోసం ఎదురు చూస్తున్నారు. కాల్వ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడంలేదని ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విజయవాడ రూరల్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, ఇతర రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే వంశీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన స్లూయిజ్ పటిష్టతకు నిధులిస్తానని భరోసా ఇవ్వడంతో, ఐడీసీ డీఈఈ ప్రభాకర్ శర్మతో కలసి నాగిరెడ్డి తదితరులు పాముల కాల్వలో రబ్బీ్షను పోసే పనులను ప్రారంభించారు. పనులను పర్యవేక్షించిన వారిలో నున్న ఉప సర్పంచ్ కలకోటి బ్రహ్మానందరెడ్డి, నున్న సొసైటీ అధ్య క్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, డైరెక్టర్ భీమవరపు ముత్తారెడ్డి తదితరులు ఉన్నారు.