మహిళలపైనే హింస అధికం

ABN , First Publish Date - 2022-12-30T01:01:20+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది మహిళలపై హింస పెరిగింది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చామని ప్రభుత్వం చంకలు గుద్దుకున్నా నేరాలు అదుపు కావడం లేదు. జిల్లాలో మహిళలపైనా, ప్రధానంగా బాలికలపైనా లైంగిక నేరాలు 50 శాతం పెరిగాయి. ఎస్పీ వెల్లడించిన వార్షిక నేర సమీక్ష వివరాలే దీన్ని రూఢీ చేస్తున్నాయి. పటిష్ట నిఘా, నైట్‌బీట్‌లను పెంచడం ద్వారా ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్యను కొంతమేర తగ్గించగలిగామని ఆయన తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన ఆరువేల కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లా నిలిచిందని ఎస్పీ వెల్లడించారు.

మహిళలపైనే  హింస అధికం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లా వార్షిక నేర సమీక్షా వివరాలను ఎస్పీ జాషువా గురవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... 2021లో 13,061 కేసులు నమోదేతే 2022లో 10,762 నమోదయ్యాయి. 2021లో జిల్లాలో 28 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 27 కేసులు నమోదయ్యాయి. దోపిడీ కేసులు గతేడాది 10 నమోదు కాగా, ఈ ఏడాది మూడు కేసులు నమోదయ్యాయి. కన్నపు నేరాలు గతేడాది 117 నమోదు కాగా, ఈ ఏడాది 112 నమోదయ్యాయి. దొంగతనాలు గతేడాది 472నమోదు కాగా, ఈ ఏడాది442 నమోదయ్యాయి. ఈ ఏడాది 459 దొంగతనం కు సంబందించిన నేరాలలో నిందితులను పట్టుకుని వారి నుంచి రూ.4.20 కోట్లను రికవరీ చేశారు.

మహిళలపై పెరిగిన నేరాలు

ఈ ఏడాది మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 1,133 కేసులు నమోదైతే ఈ ఏడాది 1,259 కేసులు నమోదయ్యాయి. బాలలపై లైంగిక నేరాల సంఖ్య గతేడాది 100 నమోదు కాగా, ఈ ఏడాది 154 కేసులు నమోదయ్యాయి. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలగడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ కేసులు ఈ ఏడాది 87 నమోదయ్యాయి. ఎక్సైజ్‌ కేసులు 2021లో 358 నమోదుకాగా, ఈ ఏడాది 52 కేసులను నమోదయ్యాయి. ప్రొహిబిషన్‌ కేసులకు సంబంధించి గతేడాది 485 కేసులలో 560 మంది అదుపులోకి తీసుకుని 5,439 లీటర్ల నాటుసారాయిను, మూడు వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఏడాది 280 కేసులు నమోదు చేసి 360మందిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-12-30T01:01:21+05:30 IST