అవినీతి అనకొండలు.. నవ నందిగామ నిర్మాతలా?
ABN , First Publish Date - 2022-11-30T00:26:27+05:30 IST
వందల కోట్ల రూపాయలు మింగిన అవినీతి అనకొండలు నవ నందిగామ నిర్మాతలు ఎలా అవుతారని మాజీ ఎమ్మెల్యే తంగిరా సౌమ్య విమర్శించారు.
నందిగామ రూరల్, నవంబరు 29 : వందల కోట్ల రూపాయలు మింగిన అవినీతి అనకొండలు నవ నందిగామ నిర్మాతలు ఎలా అవుతారని మాజీ ఎమ్మెల్యే తంగిరా సౌమ్య విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ (సోదరులు) చేసిన అవినీతిపై గాంధీ సెంటర్లో మంగళవారం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ మొండితోక సోదరుల అవినీతి భాగోతం నందిగామ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసునన్నారు. నవనందిగామ నిర్మాతలని ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఇక్కడికి రాక ముందే నందిగామ అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నికలకు ముందు సుబాబుల్ టన్నుకు ఐదు వేల రూపాయలు ఇప్పిస్తామని నమ్మించి ఎన్నికలు అయిపోయిన తరువాత సుబాబుల్కు ధర రాకుండా దోచుకునే వారికి మీరు అందిస్తున్న సహకారం అందరికీ తెలుసన్నారు. నందిగామ ప్రాంతంలో కొండలకు గుండ్లు కొట్టి మీరు రూ.కోట్లు సంపాధించుకుంటే పట్టణ అభివృద్ధి అని ఎలా అంటారని ప్రశ్నించారు. నియోజక వర్గంలో తాగునీరు సాగునీటికి, ఈ ప్రాంత అభివృద్ధిలో చెరగని ముద్రవేసిన దేవినేని వెంకటరమణ పేరును రైతు బజారుకు తొలగించడమేనా మీరు చేసిన అభివృద్ధి అన్నారు. గాంధీ సెంటర్లో విగ్రహాల విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఏచూరు రాము, శాఖమూరి స్వర్ణలత, కొంగర శ్రీకాంత్, లక్ష్మీ, మండవ శ్రీనివాసరావు, వనబోతుల శ్రీరామ్, కాసర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.