చెత్తపన్ను రద్దుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ABN , First Publish Date - 2022-02-19T06:25:57+05:30 IST

ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, సామాన్యులపై పన్నుల భారం మోపి ఆదాయం పెంచాలని అన్ని శాఖలకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటని రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు అన్నారు.

చెత్తపన్ను రద్దుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు 

బీసెంట్‌రోడ్డులో ఆదేశాల కాపీలు దహనం

గవర్నర్‌పేట, ఫిబ్రవరి 18 : ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, సామాన్యులపై పన్నుల భారం మోపి ఆదాయం పెంచాలని అన్ని శాఖలకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటని రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు అన్నారు. చెత్తపన్ను విధింపును వ్యతిరేకిస్తూ పౌర సంక్షేమ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం బీసెంట్‌ రోడ్డులోని మహంతి చేపలమార్కెట్‌ సెంటర్‌లో చెత్తపన్ను ఆదేశాల కాపీలను దహనం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి సమీక్షలు చేయకుండా ఆదాయ వనరులు పెంచేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించి రావాలని ఆదేశాలివ్వడం ఆందోళనకరమన్నారు. పట్టణ సంస్కరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం చెత్తపై పన్ను వేయడం సిగ్గుచేటన్నారు. ఏనాడు లేని విధంగా అద్దెదారులపైనా పన్ను భారం మోపడం అమానుషచర్యన్నారు. పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం, స్థానిక సంస్థలు తప్పుకోవాలని చూడటం శోచనీయమన్నారు. ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్నుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, ప్రజలు కూడా చెత్తపన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి నిరసన తెలపాలని కోరారు. అన్ని వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. పౌర సంక్షేమ సంఘం, సీఐటీయూ నేతలు దోనేపూడి కాశీనాథ్‌, రమణారావు, సీతారాములు, వై. సుబ్బారావు, లక్షణ, కె. శ్రీనివాస్‌, మురళీ, భూలోకం, కొండా పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:25:57+05:30 IST