అయ్యో పాపం
ABN , First Publish Date - 2022-07-18T06:20:40+05:30 IST
అయ్యో పాపం
పోల్రాజ్ కాల్వలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
గుడ్లవల్లేరు, జూలై 17 : అప్పటివరకూ ఇంటి వద్ద తోటిపిల్లలతో ఆనందంగా ఆడుకున్న నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతిచెందిన ఘటన గుడ్లవల్లేరులోని జేమ్స్పేటలో ఆదివారం విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులు చేసుకునే మేకల దుర్గారావు కుటుంబం జేమ్స్పేటలో నివాసం ఉంటోంది. దుర్గారావు రోజువారీ పనులకు వెళ్లగా, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకుంటున్న నాలుగేళ్ల ప్రియదర్శిని పక్కనే ఉన్న పోల్రాజ్ కాల్వలో పడిపోయిన ఆటబొమ్మను తీసుకునేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతైంది. తోటిపిల్లల కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు కాల్వలో గాలించి సుమారు గంట తర్వాత బాలిక మృతదేహాన్ని గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న బాలికను చూసిన కుటుంబసభ్యులు విలపించారు. గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.