పక్షవాతంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
ABN , First Publish Date - 2022-08-21T06:16:38+05:30 IST
పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరం అని ప్రముఖ నరాల వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎల్.గౌతమ్ ముఖేష్ అన్నారు.
పక్షవాతంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
డాక్టర్ ఎల్.గౌతమ్ ముఖేష్
పటమట, ఆగస్టు 20 : పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరం అని ప్రముఖ నరాల వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎల్.గౌతమ్ ముఖేష్ అన్నారు. శనివారం వాసవ్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ‘పక్షవాతం’ అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. పక్షవాతం లక్షణాలు కనబడిన గంటలోగా చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరికి వాళ్ల జీవిత కాలంలో పక్షవాతం లక్షణాలు కనబడతాయన్నారు. స్థూలకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె జబ్బులు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం పక్షవాతం రావటానికి కారణాలన్నారు. పక్షవాతం వచ్చిన వాళ్లకి ఎంత త్వరగా సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్ష చేస్తే అంత త్వరగా మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం కుదురుతుందన్నారు. పక్షవాతం నుంచి కోలుకున్న వారికి ఫిజియోథెరపి అవసరం అవుతుం దన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 80 శాతం పక్షవాతం రాకుండా నివారించు కోవచ్చునన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు.