తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-07T00:57:13+05:30 IST

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

మునుకుళ్ళ(తిరువూరు), డిసెంబరు 6: తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మునుకుళ్ల గ్రామంలో నర్సింగ్‌ రాము(19) ఇంటర్‌ పూర్తి చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో తండ్రి నరసింహారావు మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన రాము సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రికి రాత్రే ఖననం చేసే ప్రయత్నం చేయటంతో సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం తహసీల్దార్‌ సురేష్‌బాబు, సీఐ బీమరాజు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై పద్మారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి

వీరులపాడు : ట్రాక్టర్‌పై నుంచి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జమ్మవరం గ్రామానికి చెందిన నందిగం పుల్లమ్మ జయంతి గ్రామంలో నూర్పిడి పనికి వెళ్లి ట్రాక్టర్‌లో వడ్లను ఇంటికి తీసుకువస్తుండగా జమ్మవరం గ్రామ శ్మశానవాటిక సమీపంలోకి వచ్చే సరికి అతివేగంతో వస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ పామును తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ట్రాక్టర్‌పై కూర్చుని ఉన్న పుల్లమ్మ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమేశ్వరరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్‌కు గాయాలు

విస్సన్నపేట: విస్సన్నపేట - పుట్రేల రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లంపట్ల సచివాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన గుడిపుడి పుల్లయ్య మోటార్‌ బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. గాయపడిన బాధితుడిని 108లో విజయవాడకు తరలించారు.

Updated Date - 2022-12-07T00:57:14+05:30 IST