గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-06-27T05:38:55+05:30 IST
మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు పోరాటం సాగిద్దామని గిరిజన సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కోనేటి దివాకర్రావ్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్రావ్
బి.కొత్తకోట జూన్ 26 : మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు పోరాటం సాగిద్దామని గిరిజన సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కోనేటి దివాకర్రావ్ పిలుపునిచ్చారు. ఆదివారం హార్సిలీహిల్స్లో మైదాన ప్రాంత గిరిజన సంఘాల ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నరహరి ప్రసాద్, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు అక్కులప్పనాయక్, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.బి.శంకరయ్య, గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు పాలకీర్తి రవి, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్కుమార్ దర్మ, టీడీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కాలే నాయక్, బీజేపీ రాష్ట్ర మోర్చా జిల్లా అధ్యక్షుడు రెడ్డిశేఖర్, ఏపీ చెంచు సంక్షేమ సంఘం అధ్యక్షురాలు నారాయణమ్మ, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమ్లా నాయక్, ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.గంగన్న, యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు వెంకటేశ్వర్లు, హైకోర్టు న్యాయవాది రామకృష్ణ, యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురుమల రామచంద్రయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలో మాత్రమే రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ మైదాన ప్రాంతంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నా రిజర్వేషన్లు లేకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంత గిరిజన సదస్సులు నిర్వహించి మైదాన ప్రాంత గిరిజనులలో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. సదస్సులో రాయలసీమ ప్రాంతంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన చెంచు, యానాది, ఎరుకుల, లంబాడి, సంఘాల నాయకులు హాజరయ్యారు.