కొత్త పీఆర్సీ వద్దు... పాత జీతాలే ఇవ్వండి
ABN , First Publish Date - 2022-01-24T04:25:23+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత జీతాలే 27 శాతం ఐఆర్తో కొనసాగించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఆర్.గురుకుమార్ తెలిపారు.
రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ గురుకుమార్
జమ్మలమడుగు రూరల్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత జీతాలే 27 శాతం ఐఆర్తో కొనసాగించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఆర్.గురుకుమార్ తెలిపారు. ఆదివారం జమ్మలమడుగు పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్టీయూ ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్నారు. కొత్త పీఆర్సీ వలన రూ.10,247 కోట్ల ఆర్థికభారం పడకుండా పాత జీతాలు కొనసాగించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన అయిదు డీఏలు ఆర్థిక శాఖ వద్ద ఉన్న 60 నెలల డీఏ బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 2021 మే ఆ తర్వాత పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం వెంటనే జమ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన విద్యావిధానం వలన ప్రాథమిక విద్య నిర్వీర్యం కాబోతున్నదని, సింగిల్ టీచర్ పాఠశాలలు పెరుగుతాయని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ రీజియన్ కన్వీనర్ ప్రతా్పరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివరామిరెడ్డి, భాస్కర్, జమ్మలమడుగు ఎస్టీయూ అధ్యక్షుడు మహమ్మద్గౌస్, లక్షుమయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.