లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-24T05:00:30+05:30 IST
లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంటపంపల్లె సమీపంలో కడప-చెన్నై జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఒంటిమిట్ట, జనవరి 23 : లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంటపంపల్లె సమీపంలో కడప-చెన్నై జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజంపేట నుంచి కడపకు ఏపీ04ఏయు2699 స్కూటీపై వెళుతున్న కడప రవీంద్ర నగర్కు చెందిన షేక్ మున్న (20) అనే యువకుడు కడప వైపు నుంచి చెన్నైకి వెళుతున్న ఏపీ02టీబీ2768 లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ సం జీవరాయుడు తెలిపారు.
అదుపు తప్పి ఆటో బోల్తా... వృద్ధుడు మృతి
సిద్దవటం, జనవరి 23 : సిద్దవటం మండ లం ఎస్.రాజంపేట వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో జ్యోతి గొల్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బానాయక్ (76) అనే వృద్ధుడు అక్కడకిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళితే... జ్యోతి గొల్లపల్లె కు చెందిన సుబ్బానాయక్ అతని భార్య మునెమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఆటోలో సిద్దవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చికిత్స నిమిత్తం వస్తుండగా ఎస్.రాజంపేట మలుపు వద్ద పందులు గుంపుగా రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుబ్బానాయక్ ఆటో నుంచి కింద పడటంతో తలకు శరీరానికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. మునెమ్మకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్రెడ్డి తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం రూరల్, జనవరి 23: నగర పంచాయతీ పరిధిలోని మంగళవీధికి చెందిన షేక్ అన్సార్బాష (48) మద్యంలో సూపర్వాస్మల్ కలుపుకుని తాగి మృతిచెందాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అన్సర్బాష ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడని, శనివారం సాయంత్రం సూపర్వాస్మల్ తాగి ఆకస్మారకస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందాడని తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పజెప్పారన్నారు.