పీలేరులో ముగిసిన ఐఆర్ఎంఏ బృంద పర్యటన
ABN , First Publish Date - 2022-08-13T04:29:51+05:30 IST
పీలేరులోని స్వయం సహాయక బృందాల మహిళలు చేపడుతున్న ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై అధ్యయనానికి వచ్చిన గుజరాత్ ఐఆర్ఎంఏ బృంద పర్యటన శుక్రవారం ముగిసింది.
పీలేరు, ఆగస్టు 12: పీలేరులోని స్వయం సహాయక బృందాల మహిళలు చేపడుతున్న ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై అధ్యయనానికి వచ్చిన గుజరాత్ ఐఆర్ఎంఏ బృంద పర్యటన శుక్రవారం ముగిసింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) దేశవ్యాప్తంగా గుర్తించిన అత్యంత ప్రభావశీల మండల సమాఖ్యల్లో పీలేరు కూడా ఉండడం, ఇక్కడ అమలవుతున్న పథకాలను అధ్యయనం చేయడానికి గుజరాత్ రాష్ట్రం ఆనంద్ పట్టణానికి చెందిన ప్రతిష్టాత్మక ఇన్సిటిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్(ఐఆర్ఎంఏ) సంస్థ బృందం వచ్చిన విషయం పాఠకులకు విధితమే. గత మూడు రోజులుగా ఐఆర్ఎంఏకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శంభూ ప్రసాద్ నేతృత్వంలోని బృంద సభ్యులు మండలంలోని పలు గ్రామసమాఖ్యలతో సమావేశమయ్యారు. ఆ క్రమంలో శుక్రవారం స్థానిక ఈద్గాహ్ మైదానంలో పలు సంఘాల మహిళలతో మాట్లాడారు. బృందంలోని రీసెర్చి అసోసియేట్ ప్రశాంత్ మాట్లాడుతూ వ్యవసాయేతర జీవనోపాధులు, సేంద్రీయ పద్ధతులు, పాలసేకరణలో పీలేరు మండల మహిళలు అవలంభిస్తున్న పద్ధతులు ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు. తమ అధ్యయన సారాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ రూతు, ఏపీఎంలు లక్ష్మణ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సీసీలు పాల్గొన్నారు.