జూలై, ఆగస్టులో చేపల వేట నిషేధించాలి
ABN , First Publish Date - 2022-07-02T05:27:19+05:30 IST
ఏటా జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేట నిషేధాన్ని అమలు చేయాల్సిందేనని టీడీపీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాటగిరి రాంప్రసాద్ డిమాండ్ చేశారు.
టీడీపీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు
కడప(ఎర్రముక్కపల్లి), జులై 1: ఏటా జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేట నిషేధాన్ని అమలు చేయాల్సిందేనని టీడీపీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాటగిరి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లాలోని సోమశిల, బ్రహ్మంసాగర్, అన్నమయ్య ప్రాజెక్టు, వెలుగోడు, గండికోట తదితర రిజర్వాయర్లలో చేపలు గుడ్లు పెట్టే సమ యం కావడంతో జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను నిషేధిస్తుం టారన్నారు. ఇలాంటి సమయంలో చేపలు పడితే కోట్లాది చేపపిల్లలు గ్రుడ్డు దశలోనే చనిపోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఫలితంగా మత్స్య సంపద ద్వారా లభించే ప్రభుత్వ ఆదాయాన్ని కోల్పోవడమేకాక, చేపల వేటను నమ్ముకుని, చేపలు అమ్ముకుని జీవిస్తున్న చిరు మత్స్యకారులు ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. మత్స్య శాఖ జిల్లా అధికారులు వెంటనే స్పందించి వేట నిషేధాన్ని అమలు చేయకపోతే మత్సకారులందరినీ ఐక్యం చేసి సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో మానా చంద్రశేఖర్, కృష్ణ, వర్దిబోయిన రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు.