ఖతీబ్ ఈనాం భూముల పరిశీలన
ABN , First Publish Date - 2022-09-09T04:26:25+05:30 IST
గుర్రంకొండలో కోట్ల విలువైన ఖతీబ్ ఈనాం భూములను గురువారం తహసీల్దార్ కృష్ణమోహన్ పరిశీలించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
గుర్రంకొండ, సెప్టెంబరు 8: గుర్రంకొండలో కోట్ల విలువైన ఖతీబ్ ఈనాం భూములను గురువారం తహసీల్దార్ కృష్ణమోహన్ పరిశీలించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో గురువారం ‘ఎవరీ శ్రీరాములు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖతీబ్ ఈనాం భూముల వివరాలను సేకరించారు. సర్వే నెంబరు 831/1లో 164.35 ఖతీబ్ ఈనాం భూమిని 1బీ నమూనా పొందిన శ్రీరాములు ఎవరన్న దానిపై ఆరా తీశారు. శ్రీరాములు పేరిట భూములు ఎప్పుడు తారుమారు చేశారని రికార్డులను పరిశీలించారు. భూములు తారుమారు చేసిన సమయంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల వివరాలను సేకరించారు. అనంతరం ఆ భూముల వారసులతో కలిసి వెళ్లి భూములను పరిశీలించారు. అంతేకాకుండా వారి రికార్డులను చూశారు. మా భూములను ఇతరుల పేరిట ఎలా మార్చారంటూ అధికారులను వారు నిలదీశారు. తమ భూములను శ్రీరాములు పేరిట ఉన్న 1బీ నమూనా నుంచి తక్షణం తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. లేకుంటే తామందరమూ జిల్లా అధికారుల వద్దకు పోవాల్సి వస్తుందని తెలిపారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు.