మామిడి మొక్కల నరికివేత

ABN , First Publish Date - 2022-12-05T22:57:17+05:30 IST

మండల కేంద్రమైన సుండుపల్లె-సానిపాయి ప్రధాన రహదారి పక్కన ఓ దళిత కుటుంబం మూడేళ్లుగా పెంచుకుంటున్న మామిడి మొక్కలను ఆదివారం రాత్రి దుండగులు నరికివేశారు. తోట చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కూసాల ఇనుప కంచెను కూడా ధ్వంసం చేశారు.

మామిడి మొక్కల నరికివేత
నరికివేసిన మామిడి మొక్కలు

తోట చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ ధ్వంసం

అడిషనల్‌ ఎస్పీ పరిశీలన

సుండుపల్లె, డిసెంబరు 5: మండల కేంద్రమైన సుండుపల్లె-సానిపాయి ప్రధాన రహదారి పక్కన ఓ దళిత కుటుంబం మూడేళ్లుగా పెంచుకుంటున్న మామిడి మొక్కలను ఆదివారం రాత్రి దుండగులు నరికివేశారు. తోట చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కూసాల ఇనుప కంచెను కూడా ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకుని తోటను పరిశీలించిన దళిత కుటుంబానికి చెందిన మహిళా రైతు లక్ష్మిదేవి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల వివరాల మేరకు... కస్తూర్బా బాలికల కళాశాల సమీపంలో సానిపాయి రోడ్డు పక్కన చెరువుకిందపల్లె హరిజనవాడకు చెందిన లక్ష్మిదేవి ఎన్నో ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమిలో మూడేళ్ల కిందట మామిడి మొక్కలు నాటి పెంచుకుంటోంది. ఆ తోటకు చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుంది. అయితే కంచె ఏర్పాటు చేసిన రోజు రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు కంచెను ధ్వంసం చేయడంతో పాటు తోటలో ఉన్న సుమారు 73కిపైగా మామిడి మొక్కలను కొడవళ్లతో నరికి వేశారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మిదేవి తోట వద్ద భోరున విలపిస్తూ తాము బతికేదెట్ల అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే మామిడి మొక్కల నరికివేతకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మామిడి మొక్కల నరికివేత విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ సోమవారం సాయంత్రం మామిడి మొక్కలను, ధ్వంసమైన కంచెను పరిశీలించారు. అనంతరం బాధిత రైతు లక్ష్మిదేవిని విచారించారు. మొక్కల నరికివేతపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-12-05T22:57:20+05:30 IST