వైసీపీ కార్యకర్తల.. వీరంగం

ABN , First Publish Date - 2022-09-23T05:49:13+05:30 IST

గ్రామంలో జరిగిన స్వల్ప ఘర్షణ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే కర్రలు, ఈటెలు, కత్తులతో స్వైరవిహారం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం బలిజేపల్లి గ్రామంలో గురువారం జరిగింది.

వైసీపీ కార్యకర్తల.. వీరంగం
కర్రలు, కత్తులతో తిరుగుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు

స్వల్ప ఘర్షణ నేపథ్యంలో హల్‌చల్‌

ఈటెలు, కత్తులతో పోలీసుల సమక్షంలోనే స్వైరవిహారం 

గృహాలు విడిచివెళ్లిన టీడీపీ మద్దతుదారులు

పల్నాడు జిల్లా బలిజేపల్లిలో ఘటన

 రాజుపాలెం, సెప్టెంబరు 22: గ్రామంలో జరిగిన స్వల్ప ఘర్షణ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే కర్రలు, ఈటెలు, కత్తులతో స్వైరవిహారం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం బలిజేపల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీతారామయ్య, చావలి నాగరాజుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో అక్కడున్న స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపారు. అందరం ఒకే సామాజికవర్గానికి చెందిన వారమని, గొడవ పడ్డ ఇరువురు కూడా దగ్గరి బంధువులని భావించి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పొలంపనుల్లో నిమగ్నమయ్యారు. అనంతరం నాగరాజు, వైసీపీ కార్యకర్తలతో కలసి ఈటెలు, కర్రలు, కత్తులతో గ్రామం మొత్తం కలియ తిరిగారు. ఎవడ్రా మమ్మల్ని ఆపేదని, ఇది మా ప్రభుత్వం ఏమైనా చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఉన్న టీడీపీ మద్దతుదారులైన గృహాల వద్దకు వెళ్లి కర్రలతో తలుపులు కొట్టి వెళ్లిపోయారు. అప్పటికే కొంతమంది టీడీపీ కార్యకర్తలు గృహాలు విడిచివెళ్లారు. గ్రామంలో వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో సంచరించటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలు చెందారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు  ఈటెలు, కర్రలు, కత్తులతో తిరగటం విశేషం. సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆదేశాల మేరకు రాజుపాలెం ఎస్‌ఐ బలిజేపల్లి వెళ్లి గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఘర్షణపడ్డ సీతారామయ్య టీడీపీ మద్దతు దారుడు కాగా చావలి నాగరాజు వైసీపీ మద్దతుదారుడు. ఇదే విషయమై బలిజేపల్లి టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు పళ్లపాటి పెద్దిరాజు తన వర్గీయులతో వచ్చి కేసు పెట్టారు. 

 

Updated Date - 2022-09-23T05:49:13+05:30 IST