సర్పంచు కూడా సీఎంలా అబద్ధాలు ఆడలేడు: కనపర్తి

ABN , First Publish Date - 2022-09-17T05:48:25+05:30 IST

గ్రామ సర్పంచు కూడా ముఖ్యమంత్రిలా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడలేడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు.

సర్పంచు కూడా సీఎంలా అబద్ధాలు ఆడలేడు: కనపర్తి
సమావేశంలో మాట్లాడుతున్న కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): గ్రామ సర్పంచు కూడా ముఖ్యమంత్రిలా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడలేడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పీఠం కోసం దేవుళ్లకు సైతం ప్రాంతీయతను అంటగట్టి రాష్ట్రంలో మారణహోమం సృష్టించగల సమర్థుడు సీఎం జగన్‌ అని ఆయన ఆరోపించారు. పచ్చళ్ల విక్రయాలు, పాల డెయిరీలు స్థాపించి నిజాయితీగా డబ్బు సంపాదించకోవడంలో తప్పులేదని, భాగస్వాములను హత్యచేసి గనులను ఆక్రమించి వారి కుటుంబాలను అనాథలుగా చేసిన పాపం మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సామాజికవర్గానికి చెందిన వారెవరూ జీవించడానికి వీల్లేదు అని జగన్‌ జీవో తెచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధి అయినా, అమరావతి అభివృద్ధి అయినా అది చంద్రబాబుతోనే సాధ్యమని గుర్తుచేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అరాచకాలకు విశాఖవాసులు భయపడి తమకు రాజధాని వద్దని వాపోతున్నారన్నారు. వైసీపీ అరాచకాలను గుర్తించి విశాఖ వాసులు లక్ష ఓట్ల తేడాతో విజయమ్మను ఓడించి వైసీపీకి బుద్ధి చెప్పారన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలను, వాటి అధిపతులను పదే పదే ఆడిపోసుకోవడం ద్వారా ఆయన పిరికితనాన్ని ఆయనే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రకటనలిచ్చి బటన్‌ నొక్కడం ఆయనకు పిచ్చిగా మారిపోయిందని ఆయన విమర్శించారు. తాను జైలుకెళ్లాడు కాబట్టి చంద్రబాబు, లోకేశ్‌లు కూడా జైలుకు వెళ్లాలని జగన్‌ ఆశపడుతున్నాడని, అది నెరవేరని కలేనని ఆయన హితవు చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు యల్లావుల అశోక్‌ యాదవ్‌, ఈరంటి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

.

Updated Date - 2022-09-17T05:48:25+05:30 IST