ప్రైవేటు స్కూల్కే.. మొగ్గు
ABN , First Publish Date - 2022-07-10T05:10:46+05:30 IST
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా పాలకులు అడుగులు వేస్తున్నారు. మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించడంటూ ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కోరేవారు.
నూతన విధ్యా విఽధానాల ఫలితం
ప్రభుత్వ పాఠశాలలో తగ్గిన విద్యార్థుల సంఖ్య
కిటకిటలాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు
కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రభుత్వ స్కూల్స్కు..
ఫీజుల భారమే ఇందుకు కారణం
ఈ ఏడాది ప్రైవేటు స్కూల్సుకు పంపేందుకు నిర్ణయం
ప్రమాదపు అంచున ప్రభుత్వ విద్యావ్యవస్థ
నరసరావుపేట, జూలై8: ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా పాలకులు అడుగులు వేస్తున్నారు. మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించడంటూ ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కోరేవారు. ఈ పరిస్థితి నుంచి వాటిని ప్రభుత్వమే బయట పడేసింది. ప్రభుత్వ నూతన విద్యా విఽఽధానాలు కూడా ప్రైవేట్ వ్యవస్థకు కలిసొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్కు విద్యార్థులు మొగ్గు చూపారు. ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ కిటికిటలాడుతుంటే ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో మాతమ్రే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ప్రవేశపెట్టడం కూడా ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెరగడానికి కూడా కారణంగా ఉంది. జిల్లాలోని పట్టణాల్లోని ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్లు లేవు అని బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. విలీన ప్రక్రియ వద్దంటూ తల్లిదండ్రులు జిల్లాలో ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వ నూతన పోకడలతో ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రమాదపు అంచున ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
గత రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరిగాయి. కరోనా వలన ఆన్లైన్ పాఠాలు నిర్వహించడంతో ప్రైవేట్ స్కూల్స్కు తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. ఫీజుల భారమూ ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. కరోనా ప్రభావం తగ్గడంతో స్కూల్స్ యధావిధిగా నిర్వహిస్తున్నారు. దీంతో మళ్లీ ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. అమ్మఒడి ప్రైవేట్ స్కూల్స్లోను అమలు చేస్తుండటంతో వీటిలో అడ్మిషన్లు పెరగడానికి కూడా ఒక కారణం. జిల్లాలో 165 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం విలీనం చేసింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ స్కూల్స్లో సరిపడా తరగతులు గదులు కూడా లేవు. పదవ తరగతి పరీక్షలలో ఎక్కువమంది తప్పడం వంటి కారణాలతో తల్లిదండ్రులు ప్రైవేట్స్కూల్స్లో వారి పిలల్లను చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూల్స్లో విద్యాబోధన మెరుగ్గా ఉంటుందన్న భావన కొందరు విద్యార్థుల తల్లిదండ్రులల్లో నెలకొంది. ప్రభుత్వ స్కూల్స్లో సెక్షన్లను కూడా తగ్గించారు. దీని వలన ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో కొత్తగా ఉపాధ్యాయులను నియమించే అవసరం లేకుండా పోతోంది. ఈ విధానాలే కొనసాగితే భవిష్యత్లో ఉపాధ్యాయుల నియమాకాలు ఉండే పరిస్థితి లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
పాఠశాలల విలీనంపై తీవ్ర వ్యతిరేకత
పాఠశాలల విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉద్యమిస్తున్నారు. విలీన ప్రక్రియను నిలిపివేయాలని వారు కోరుతున్నారు. విలీనంతో 165 స్కూల్స్ మూతపడ్డాయి. 3, 4 ,5 తరగతులను గత ఏడాది వలే ఈ ఏడాది నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మూతవేసిన స్కూల్స్ను తెరవాలని తల్లి దండ్రులు కోరుతున్నారు. వీరి మొర ఆలకించే పాలకులే కరువయ్యారు.