నెలలో ఒక రోజు దివ్యాంగుల కోసం

ABN , First Publish Date - 2022-12-08T01:17:20+05:30 IST

నెలలో ఒక రోజు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం పని చేస్తామని కలెక్టర్‌ శివశంకర్‌ హామీ ఇచ్చారు.

నెలలో ఒక రోజు దివ్యాంగుల కోసం
నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఓ దివ్యాంగురాలు

అన్ని రంగాల్లో వారు పైకొచ్చేలా ప్రణాళికలు

ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవంలో కలెక్టర్‌

నరసరావుపేట కల్చరల్‌, డిసెంబరు 7: నెలలో ఒక రోజు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం పని చేస్తామని కలెక్టర్‌ శివశంకర్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం బుధవారం పట్టణంలోని డీఎస్‌ఏ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభా వంతులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సమాజంలో అందరూ సమానమేనన్న భావన అందరిలో కలగాలన్నారు. త్వరలో వారికి ఇంటి నివేశన స్థలాలు, ఆధార్‌ కార్డు నమోదు కేంద్రాలు, సదరన్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత చిన్నారుల నుంచి కలెక్టర్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, క్రీడా పోటీలను నిర్వహించారు. దివ్యాంగులకు ట్రై సైకిల్‌, చేతి కర్రలు, ల్యాబ్‌ ట్యాప్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల, వయో వృద్దుల సహాయ సంస్థ చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిష్టీనా, జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సువార్త, పలు శాఖల జిల్లా అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

మంచి అలవాట్లు అలవర్చుకోవాలి

నరసరావుపేట రూరల్‌: చిన్న నాటి నుంచే పరిశుభ్రమైన అలవాట్లను అలవర్చుకోవాలని, తద్వారా భవిష్యత్‌లో మంచి లక్షణాలతో, గొప్ప భావాలతో లక్ష్యాలకు చేరుకోగలుగుతారని కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. మండలంలోని పమిడిపాడు సచివాలయాన్ని కలెక్టర్‌ బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్‌ను చూసేందుకు సచివాలయం వద్దకు చేరుకున్న పిల్లలను చూసి కొద్ది సేపు వారితో ఆయన ముచ్చటించారు. క్రమశిక్షణ, పెద్దవారి పట్ల గౌరవ భావాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం సచివాలయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులతో మాట్లాడారు.

Updated Date - 2022-12-08T01:17:24+05:30 IST