నిడమర్రు రోడ్డులో ఆర్వోబీ
ABN , First Publish Date - 2022-04-20T05:40:32+05:30 IST
మంగళగిరి-నిడమర్రు రోడ్డులో రైల్వేలైనుపై ఓవర్బ్రిడ్డిని నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్సిగ్నల్ను ఇచ్చింది.
రూ.70.32 కోట్లతో నిర్మాణం
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: ఎమ్మెల్యే ఆళ్ల
మంగళగిరి, ఏప్రిల్ 19: మంగళగిరి-నిడమర్రు రోడ్డులో రైల్వేలైనుపై ఓవర్బ్రిడ్డిని నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్సిగ్నల్ను ఇచ్చింది. రూ.70.32 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆర్వోబీ నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి చేపట్టేందుకు కేంద్ర రైల్వేశాఖ సమ్మతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సమాచారం అందిందని స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రకటించారు. రాబోయే మూడు మాసాల్లోనే ఈ ఓవర్ బ్రిడ్జికి నిర్మాణానికి సంబంధించి టెండర్లను కూడ పిలువనున్నట్టు ఆయన తెలిపారు. మంగళగిరి-నిడమర్రు రోడ్డులో విజయవాడ-గుంటూరు రైల్వేలైనుపై ఈ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. రాజఽధాని గ్రామాలను మంగళగిరితో అనుసంధానం చేసేందుకు, దూరప్రాంతాల నుంచి వచ్చేవారు మంగళగిరి మీదుగా రాజధానిని చేరుకునేందుకు ఈ ఆర్వోబీ ఎంతగానో ఉపయోగపడుతోంది. మంగళగిరి నగరం పశ్చిమంగా విస్తరించేందుకు సైతం ఈ ఆర్వోబి సహకరిస్తుంది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న మంగళగిరి-నిడమర్రు రోడ్డులోని ఆర్వోబి నిర్మాణానికి ఎట్టకేలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించడం పట్ల మంగళగిరి ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.