యూజీడీ పనుల బకాయి నిధులివ్వండి
ABN , First Publish Date - 2022-01-29T05:34:14+05:30 IST
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సంబంధించి రూ.1082.82 కోట్లకు గాను రూ.513.13 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన 570.69 కోట్ల బ్యాలెన్స్ నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని సీఎం జగన్ను నగర మేయర్ కావటి మనోహరనాయుడు కోరారు.
సీఎం జగన్ను కోరిన నగర మేయర్ మనోహర్నాయుడు
జీఎంసీలో కీలక పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని వినతి
గుంటూరు(కార్పొరేషన్), జనవరి28: నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సంబంధించి రూ.1082.82 కోట్లకు గాను రూ.513.13 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన 570.69 కోట్ల బ్యాలెన్స్ నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని సీఎం జగన్ను నగర మేయర్ కావటి మనోహరనాయుడు కోరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవీరం సీఎం జగన్ను కలిసి శాలువా, బొకేలతో సత్కరించారు. అనంతరం గుంటూరు నగరాభివృద్ధిపై వినతి పత్రం అందజేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో అధికారుల కొరత తీవ్రంగా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్లో మల్టీలెవల్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్కు అనుమతులు ఇవ్వాలని, శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. దేవాదాయకు చెందిన కాస్రాయమ్మ పాఠశాల పాఠశాల స్థలాన్ని కార్పొరేషన్కు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ల సబ్లీజ్దారులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. నగరంలోని ఆర్యూబీ, ఆర్వోబీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. గుంటూరు నగరానికి మంజూరైన 220 ఈ-ఆటోలను అందజేయాలని, సిద్ధంగా ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు బీఫారంలో ఉంటున్నారని వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆయా సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు మేయర్ కావటి మనోహర్ తెలిపారు.