క్వారీయింగ్.. కాసులు
ABN , First Publish Date - 2022-06-20T05:46:23+05:30 IST
మట్టి మేత అధికార పార్టీకి ఆదాయ వనరుగా మారింది.
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
అధికార పార్టీకి ఆదాయ వనరు
మామూళ్ల గంతల్లో మైనింగ్ శాఖ
అసైన్డ్, వక్ఫ్ బోర్డు భూముల్లో క్వారీలు
ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం
నరసరావుపేట, జూన్ 19: మట్టి మేత అధికార పార్టీకి ఆదాయ వనరుగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులతో సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ.. ఏ భూములంటే ఆ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వి తరలించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. నరసరావుపేట, నకరికల్లు మండలాల్లోని పలు ప్రాంతాల్లో గ్రావెల్ కొంతకాలం నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు వెలిశాయి. అనధికార తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. అసైన్డ్, వక్ఫ్ బోర్డు భూముల్లో మట్టి క్వారీలు ఏర్పాటు చేశారు. ఎవరైనా అధికారి స్పందించి చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించినా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉంటున్నాయి. దీంతో ఆ అధికారి కూడా మిన్నకుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ట్రాక్టర్ గ్రావెల్ రూ.1000 నుంచి 1500, టిప్పర్ రూ.5,600 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ శాఖ అధికారులు కళ్లకు మామూళ్ల గంతలు కట్టుకున్నారన్న విమర్శలున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కుల పంచన చేరిపోయారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్, పట్టా భూముల్లో తవ్వకాలకు కూడా మైనింగ్ శాఖ అనుమతులు తప్పనిసరి. అయినా వాటితో సంబంధం లేకుండా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.
మంత్రి ఇలాకాలో...
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం అడ్డరోడ్డు సమీపంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొంతకాలంగా తవ్వి విక్రయిస్తున్నారు. గుంటూరు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) కట్ట సమీపంలో అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నది. చట్టాలు, నిబంధనల గురించి నిత్యం మాట్లాడే మంత్రి అక్రమ మైనింగ్ను నిరోధించేందుకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. క్వార్జ్ క్వారీకి మాత్రమే అనుమతి ఉందని, గ్రావెల్కు అనుమతులు లేవని మైనింగ్ ఏడీ తెలిపారు. మట్టి తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తురకపాలెం, రావిపాడు చెరువులో..
నకరికల్లు మండలం తురకపాలెం వద్ద కూడా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొంతకాలంగా పెద్ద ఎత్తున మట్టి తవ్వి కొందరు విక్రయించుకుంటున్నారు. రావిపాడు చెరువు అధికార పార్టీ వ్యక్తులకు ఆదాయ వనరుగా మారింది. చెరువులో పూడిక తీత పేరుతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పూడిక తీసే పనులకు అనుమతులు ఇస్తే సదరు అధికారులు పర్వవేక్షణలో పనులు జరగాలి. కాని అలాంటి ఆనవాళ్లు ఏమీ లేకుండా ఎక్స్కవేటర్తో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.500కు విక్రయిస్తున్నారు.
ప్రమాదభరింతంగా క్వారియింగ్
ములకలూరు నుంచి ఆగ్రహారం వెళ్లే మార్గంలో చెరువు సమీపంలో క్వారీ ఏర్పాటు చేశారు. ములకలూరు పీర్ల చావిడికి సంబంధించిన వ్యక్తులు సాగు చేసుకునే హక్కుతో ఉన్న భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఎక్స్కవేటర్లను ఏర్పాటు చేసి భారీగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ప్రమాదభరింతంగా క్వారియింగ్ జరుగుతున్నది. దీనిపై అధికార పార్టీ వ్యక్తుల మధ్య వివాదం కూడా జరిగినట్లు ప్రచారం ఉంది. వక్ఫ్ బోర్డు అధికారులకు మట్ట తవ్వకాలపై కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దారు దృష్టికి కూడా మట్టి వ్యవహారాన్ని తీసుకువెళ్లినట్టు పలువురు తెలిపారు. అయినా సదరు అధికారులు స్పందించక పోతుండటంపై విమర్శలున్నాయి.