ఇసుక.. యథేచ్ఛగా

ABN , First Publish Date - 2022-08-22T06:07:02+05:30 IST

బాపట్ల పరిధిలో అక్రమ ఇసుక వ్యాపారం దర్జాగా సాగుతున్నది. జగనన్నకాలనీల్లో ఇళ్లకు ఇసుక దొరక్క సామాన్యులు బేస్‌మెంట్‌లోనే వదిలేసుకుంటున్నారు.

ఇసుక.. యథేచ్ఛగా
బేతనీకాలనీ లేఅవుట్‌కు వెళ్ళే దారిలో రియల్‌ ఎస్టేట్‌ పొలాలు మెరక చేస్తూ గుట్టలుగా పోసిన ఇసుక

అక్రమార్కులకు అధికార అండ

సామాన్యులపై అధికారుల ప్రతాపం

పేదలకు దొరకదు.. పెద్దలకు కావాల్సినంత


ఇసుక.. అక్రమాలు కోకొల్లలు. అడ్డుకోవాల్సిన వారు అండగా ఉంటున్నారు. దీంతో ధర నుంచి రవాణా వరకు యథేచ్ఛగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నాయకుల ఆశీస్సులు.. అధికారుల అండదండలతో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతున్నది. సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక కావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అదే రియల్‌ వ్యాపారులు ఎన్ని టిప్పర్లు కావాలంటే అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడైనా సామాన్యుడు ఇసుక తెచ్చుకుంటూ ఉంటే అడ్డుకుని ఇబ్బంది పెట్టే అధికారులు పెద్దల జోలికి మాత్రం వెళ్లడంలేదు. 


బాపట్ల, ఆగస్టు 21: బాపట్ల పరిధిలో అక్రమ ఇసుక వ్యాపారం దర్జాగా సాగుతున్నది. జగనన్నకాలనీల్లో ఇళ్లకు ఇసుక దొరక్క సామాన్యులు బేస్‌మెంట్‌లోనే వదిలేసుకుంటున్నారు. సామాన్యులు ఇసుక తెచ్చుకుంటే అదనపులోడ్‌ అంటూ సెబ్‌ అధికారులు ఆపడం జరిమానా వేయడం, పోలీసుస్టేషన్‌లకు తరలించడం పరిపాటిగా మారింది. అదే రియల్‌ వ్యాపారులు ఎకరాలకు ఎకరాలు మెరక చేసేందుకు పదుల సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారే లేరు. 


పోలీసులు విఫలం..

ఇటీవల డీజీపీ బాపట్ల పోలీసు కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఇసుక వ్యాపారం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళినా జిల్లా పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌ మెరక చేయడానికి తామే ఇసుక పంపించామని పలువురు వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. పోలీసులు అండగా ఉన్నారని వారు బాహాటంగానే చెప్తుకుంటూ ఉన్నారు. చెరుకుపల్లి నుంచి టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నా పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారుల మాటలు నిజమేనని పలువురు భావిస్తున్నారు. వెదుళ్లపల్లి బధిరుల ఆశ్రమపాఠశాల వెనుక ఆసైన్డ్‌భూముల్లో పెద్దఎత్తున తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. కర్లపాలెం మండలం రెడ్డిపాలెం, బాపట్ల మండలం పాండురంగాపురం, బేతపూడి, వెదుళ్లపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఇసుక దళారులు అన్నిశాఖల అధికారులను సమన్వయ పరిచి సజావుగా వ్యాపారం జరిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అందువల్లే అధికారులు ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 


పగలు రాత్రి.. టిప్పర్ల రాకపోకలు

బేతనీకాలనీ వద్ద జగనన్నకాలనీ పక్కనే ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుమారు 20 ఎకరాలకుపైగా మెరక చేసి వెంచర్‌ వేస్తున్నారు. ఇందు కోసం పగలు రాత్రి అన్న తేడా లేకుండా టిప్పర్లు ఆర్‌వోబీ మీదగా దూసుకుపోతున్నాయి. ఆ ప్రాంత ప్రజలు వీరిని నిలదీసినా ఆగేది లేదంటూ ఇసుకను తరలిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న టిప్పర్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇటీవల పిట్టలవానిపాలెం మండలంలో ఇసుకటిప్పరు ఢీకొట్టటంతో ఓ యువకుడు మృతి చెందాడు. బాపట్ల కలెక్టరేట్‌కు వెళ్లే రోడ్డులో టిప్పర్‌ ఢీకొట్టటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విధంగా నిత్యం టిప్పర్ల దాటికి వాహనచోదకులు భయపడుతున్నారు. అతివేగంతో ఇసుక తరలిస్తూ రోజుకు ఎన్నిట్రిప్పులు వస్తే అన్ని డబ్బులు వస్తాయని వాహనాలు నడుపుతున్నారు. బాపట్ల రథంబజారు సెంటర్‌ను కూడా వదలకుండా టిప్పర్లు తిరుగుతున్నాయి.  

  


Updated Date - 2022-08-22T06:07:02+05:30 IST