అక్రమార్కుల చెరలో ఎర్రచెరువు

ABN , First Publish Date - 2022-07-18T06:02:16+05:30 IST

మండల కేంద్రమైన చేబ్రోలు ఎర్రచెరువు అక్రమార్కులబారిన పడింది. గత కొద్దిరోజులుగా ఎర్రచెరువును చెరబట్టిన అక్రమార్కులు యధేచ్ఛగా చెరువుమట్టి తవ్వకాలను సాగిస్తున్నారు.

అక్రమార్కుల చెరలో ఎర్రచెరువు
ఎర్ర చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్న ఎక్స్‌కవేటర్‌

అధికారమే అండగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

అభివృద్ధి పనుల పేరుతో సొమ్ముచేసుకుంటున్న వైనం

చోధ్యం చూస్తున్న అధికారులు

చేబ్రోలు, జూలై 17: మండల కేంద్రమైన చేబ్రోలు ఎర్రచెరువు అక్రమార్కులబారిన పడింది. గత కొద్దిరోజులుగా ఎర్రచెరువును చెరబట్టిన అక్రమార్కులు యధేచ్ఛగా చెరువుమట్టి తవ్వకాలను సాగిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో మట్టి దోపిడి యథేచ్ఛగా సాగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. అధికారం ఉంటే చాలు అనుమతులు అవసరంలేదని అక్రమార్కులు ముందుకుసాగుతున్న తీరుపై చేబ్రోలులో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎర్ర చెరువులో నాణ్యమైన ఎర్రమట్టి లభించడంతో అక్రమార్కులకు కాసులవర్షం కురుస్తోంది. పాతకాలపు పంచాయితీ తీర్మానానికి కొత్త రంగులు అద్ది లక్షల విలువైన నాణ్యమైన ఎర్రమట్టిని రాత్రింబవళ్లు తవ్వి రవాణాచేసి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. జగనన్న కాలనీలకు మెరక చేస్తున్నామనే పేరుతో చెరువు మట్టిని తవ్వి చేబ్రోలు పరిసర ప్రాంతాల్లోని గ్రామస్థులకే చెరువుమట్టిని అమ్మి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా సాగుతున్న మట్టి రవాణాపై స్థానికులు ప్రశ్నించినా అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి మట్టి దోపిడీని నిలువరించాలని వేడుకుంటున్నారు.


Updated Date - 2022-07-18T06:02:16+05:30 IST