జాతీయ రహదారిపై క్రైస్తవుల నిరసన
ABN , First Publish Date - 2022-05-19T05:38:30+05:30 IST
మండలంలోని ఎర్రకొండపై రహదారిమాత దేవాలయ ప్రాంగణంలోని ఏసుక్రీస్తు, మేరిమాత విగ్రహాల ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసుల తాత్సారం చేస్తున్నారంటూ క్రైస్తవ సంఘాలు నిరసన తెలిపాయి.
విగ్రహాల ధ్వంసంపై ఎర్రకొండ వద్ద రాస్తారోకో
నిందితులపై చర్యలు తీసుకోవాలని సంఘ నేతల డిమాండ్
యడ్లపాడు, మే 18: మండలంలోని ఎర్రకొండపై రహదారిమాత దేవాలయ ప్రాంగణంలోని ఏసుక్రీస్తు, మేరిమాత విగ్రహాల ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసుల తాత్సారం చేస్తున్నారంటూ క్రైస్తవ సంఘాలు నిరసన తెలిపాయి. బుధవారం చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఎర్రకొండ వద్ద గుంటూరు - చిలకలూరిపేట మార్గంలో జాతీయ రహదారిపై క్రైస్తవసంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ ఇమ్మానియేలు మాట్లాడుతూ గత శనివారం అర్ధరాత్రి సంఘటన జరగ్గా ఆదివారం పోలీసులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి వెళ్లారన్నారు. మూడు రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదన్నారు. దీంతోనే రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. పెద్దసంఖ్యలో క్రైస్తవులు, భక్తులు అక్కడకు చేరుకుని గంటకు పైగా రోడ్డుపై ఆందోళన చేయడంతో సుమారు 2కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. అర్బన్ సీఐ జి.రాజేశ్వరరావు, యడ్లపాడు ఎస్ఐ పి.రాంబాబు, నాదెండ్ల ఎస్ఐ కె.సతీష్లు రాస్తారోకో చేస్తున్నవారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను మూడు రోజుల్లో అరెస్టు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పాస్టర్ సుభాష్ చంద్రబోస్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల జోసఫ్ ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.