కమ్ముకొస్తున్న కరోనా
ABN , First Publish Date - 2022-01-20T04:56:33+05:30 IST
జిల్లాలో కరోనా మూడో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది.
పెరుగుతున్న కొవిడ్ పాజిటివ్ కేసులు
మూడు రోజుల్లో ఏకంగా రెండు వేలు..
చాపకింద నీరులా వ్యాపిస్తోందని నిపుణుల హెచ్చరిక
ప్రజల్లో కొరవడుతున్న స్వీయరక్షణ
కొత్తగా 943 మందికి కరోనా నిర్ధరణ
పాజిటివ్ శాతం 15.83
మూడోవేవ్ ముంచుకొస్తోందా..? మరోసారి మహమ్మారి విస్తరిస్తోంది.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే అదే నిజమనిపిస్తోంది. పక్షం రోజుల కిందట రెండంకెల్లో ఉన్న కేసులు ఇప్పుడు ఏకంగా దాదాపు వెయ్యికి చేరాయి. కొవిడ్ - 19 చాపకింద నీరులా విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదంటున్నారు.
గుంటూరు, జనవరి 19(ఆంరఽధజ్యోతి): జిల్లాలో కరోనా మూడో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది. బుధవారం ఒక్క రోజే 943 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. జిల్లావ్యాప్తంగా 5,958 మంది కరోన టెస్టులు చేయించుకోగా 15.83 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. మూడో దశ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత తొలి కొవిడ్ మరణం బుధవారం చోటు చేసుకొన్నది. గత కొన్ని రోజుల నుంచి కరోనాతో చికిత్స పొందుతూ గుంటూరు నగరంలో ఒకరు మృతి చెందారు. కాగా క్రియాశీలక కేసులు 3,561కి పెరిగాయి. వారిలో 3,290 మంది హోం ఐసోలేషన్లో 271 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 592 మందిని ట్రైఏజ్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. రెంటచింతలలో ఓ బ్యాంక్లో పరిచేస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. అదే విధంగా ఓ సంక్షేమ పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్కు కరోనా పాజిటివ్గా తేలింది. రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డికి కరోనా సోకింది. నగరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మౌలాలి, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.
24 గంటల్లో 943 మందికి వైరస్
జిల్లాలో కరోన మూడో దశ వ్యాప్తి విలయ తాండవం చేస్తోన్నది. నిత్యం వందల సంఖ్యలో ఈ వైరస్కి దొరికి పోతోన్నారు. బుధవారం ఒక్క రోజే 943 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 5,958 మంది కరోన టెస్టులు చేయించుకోగా 15.83 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. మూడో దశ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత తొలి కోవిడ్ మరణం బుధవారం చోటు చేసుకొన్నది. గత కొన్ని రోజుల నుంచి కరోనతో చికిత్స పొందుతూ గుంటూరు నగరంలో ఒకరు మృతి చెందారు. కాగా బుధవారం గుంటూరు నగరంలో 464 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. నరసరావుపేటలో 83, మంగళగిరిలో 69, తాడేపల్లిలో 49, చిలకలూరిపేటలో 25, తెనాలిలో 24, పొన్నూరులో 14, గురజాలలో 14, పెదకాకానిలో 14, తుళ్లూరులో 14, బాపట్లలో 14, రేపల్లెలో 11, అమరావతిలో 6, అచ్చంపేటలో 2, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్లో 4, క్రోసూరులో 8, మేడికొండూరులో 2, ముప్పాళ్లలో 3, పెదకూరపాడులో 2, పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 9, ప్రత్తిపాడులో 2, రాజుపాలెంలో 4, సత్తెనపల్లిలో 9, తాడికొండలో 9, వట్టిచెరుకూరులో 3, దాచేపల్లిలో 2, దుర్గిలో 1, కారంపూడిలో 3, మాచవరంలో 2, మాచర్లలో 3, పిడుగురాళ్లలో 4, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 1, యడ్లపాడులో 2, నాదెండ్లలో 4, నూజెండ్లలో 1, నకరికల్లులో 7, రొంపిచర్లలో 1, శావల్యాపురంలో 1, వినుకొండలో 3, అమర్తలూరులో 5, భట్టిప్రోలులో 1, చేబ్రోలులో 6, చెరుకుపల్లిలో 4, దుగ్గిరాలలో 6, కాకుమానులో 4, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 5, కొల్లూరులో 1, నగరంలో 4, పిట్టలవానిపాలెంలో 4, చుండూరులో 2, వేమూరులో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. కాగా క్రియాశీలక కేసులు 3,561కి పెరిగాయి. వారిలో 3,290 మంది హోం ఐసోలేషన్లో 271 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్నారు. గత 24 గంటల్లో 592 మందిని ట్రైఏజ్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
మొన్నటి విలయం మరిచారా?
సెకండ్వేవ్లో(గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో) మహమ్మారి సృష్టించిన విలయం గురించి ప్రజలు అప్పుడే మరచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో చాలావరకు నిర్లక్ష్యం ఆవహించింది. కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. బయట రద్దీ ప్రాంతాల్లో భౌతికదూరం పాటించాలన్న సంగతే మర్చిపోతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరే కొంపముంచుతోంది. కరోనా మళ్లీ విజృంభించడానికి కారణమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని, ఏవైనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవడం ఉత్తమని వైద్యులు సూచిస్తున్నారు.
ఆక్సిజన్ కేసులు.. 37
గుంటూరు(జీజీహెచ్): ఇప్పటివరకు కరోనా బాధితుల కు స్వల్ప లక్షణాలే ఉంటున్నా యని, ఆక్సిజన్ అవసరం లేదని ధైర్యంగా ఉన్న అధికారులకు షాక్ తగిలింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 157 మందిలో 37 మందికి ఆక్సిజన్ అవసరమైంది. వారిని ఆక్సిజన్ బెడ్లను తరలించారు. దీంతో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వైద్యులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సెకండ్వేవ్లో చికిత్సను అందించిన నిపుణులందరినీ పిలిపించి మరోసారి సిబ్బందికి సూచనలు చేయించారు. 250కు పైగా బెడ్లను కరోనా బాధితులకు కేటాయించారు. ప్రస్తుతం అఽధికారికంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా చికిత్సకు అనుమతులు ఉన్నాయి. కానీ 90శాతం ప్రైవేటు ఆసుపత్రులలో రహస్యంగా కరోనా చికిత్సను అందిస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పలువురు కరోనా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
వేరియంట్ నిర్ధారణ ఏదీ?
ప్రస్తుతం జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్లు ఉధృతంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం ఒమిక్రాన్తో ఎటువంటి ప్రమాదం లేదు. డెల్టా వేరియంట్ సోకినవారికే ఆక్సిజన్ అవసరమవుతుంది. అయితే ఏ వేరియంట్తో రోగి బాధపడుతోందీ నిర్ధారణ కావడం లేదు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే జినోంసీక్వెన్సీ పరీక్షలు చేస్తున్నారు. ఇది కూడా చికిత్సపై ప్రభావం పడుతోంది.