ఆందోళనొద్దు.. ధాన్యం మొత్తం కొంటాం

ABN , First Publish Date - 2022-01-20T05:46:25+05:30 IST

రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కోనుగోలు చేయడం జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

ఆందోళనొద్దు.. ధాన్యం మొత్తం కొంటాం
నరగాయపాలెం ఆర్‌బీకే కేంద్రంలో రైతుకు టోకెన్‌ ఇస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

నరసరావుపేట, వినుకొండల్లో కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌  

నరసరావుపేట, వినుకొండ, జనవరి 19: రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, వినుకొండ మండలం నరగాయపాలెం ఆర్‌బీకే కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన కలెక్టర్‌ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు నుంచి 40 బస్తాల ధాన్యం కొనుగోలు చేసేవిధంగా సివిల్‌సప్లయిస్‌ వారికి నివేదిస్తామన్నారు. ధాన్యంలో తేమ శాతం 17కు మించరాదని, రైతులు ధాన్యాన్ని కల్లాల్లో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో నగదు రైతు అకౌంట్‌ల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. మద్దతు ధరకే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు.  ధాన్యం కోనుగోళ్ళ అంశంలో రైతులు సంతోషంగా ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. నరసరావుపేటలో కలెక్టర్‌ వెంట ఆర్డీవో శేషిరెడ్డి, ఏవో సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.  వినుకొండలో కలెక్టర్‌ వెంట ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తేమశాతం వ్యత్యాసాలు అంటూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. నరసరావుపేట వలె వినుకొండకు కొనుగోలు సమయాన్ని పెంచాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌ నరసరావుపేట రైస్‌మిల్లుల్లో కొనుగోలుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అనంతరం ధాన్యం రైతులకు టోకెన్‌లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శేషిరెడ్డి, వైసీపీ నాయకులు పగడాల వెంకటరామిరెడ్డి, గంధం బాలిరెడ్డితో పాటు ఏడీఏ బోయపాటి రవిబాబు, ఏవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ఆర్‌బీకేల్లో జేసీ విస్త్రృత తనిఖీలు

జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాలను జేసీ దినేష్‌కుమార్‌ తనిఖీ చేశారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం, యాజలితో పాటు మరికొన్ని ఆర్‌బీకేలను బుధవారం జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరించే సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 8,791 మంది రైతుల వద్ద నుంచి 54,194 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. గ్రేడ్‌-ఏ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,470, కామన్‌ వెరైటీకి రూ.1,455 చెల్లించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెల చివరి వరకు నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఈ-కేవైసీ చేయించుకొని ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో కనిపించని రైతుల రికార్డులను పోర్టల్‌లో కనిపించేలా తగిన చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతుల ధాన్యం ఎలా ఉన్నా తగిన సూచనలు చేసి కొనుగోలు చేస్తామన్నారు.  


Updated Date - 2022-01-20T05:46:25+05:30 IST