గడపగడపకులో జిల్లాకు మూడోస్థానం
ABN , First Publish Date - 2022-10-08T05:26:17+05:30 IST
గడపగడపకు మన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు.
సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలి
సమీక్షలో అధికారులతో కలెక్టర్ కె.విజయకృష్ణన్
బాపట్ల, అక్టోబరు 7: గడపగడపకు మన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం స్పందన సమావేశ మందిరంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి 312 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 448 పనులు గుర్తించగా 439 పనులకు అధికారికగా మంజూరు ఉత్తర్వులు లభించాయన్నారు. 75 శాతం గృహ నిర్మాణాలు జరిగిన లేఅవుట్లలో రహదార్లు, మురుగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నుంచి జిల్లాకు రూ.60 కోట్లు రానున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీల్లో ప్రజల నుంచి 248 ఫిర్యాదులు రావడంపై సమీక్షించారు. ఆయా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో భరత్, డ్వామా పీడీ శంకర్నాయక్, డీఆర్డీఏ పీడీ అర్జునరావు, వ్యవసాయశాఖ జేడీ అబ్దుల్ సత్తార్, పీఆర్ఎస్ఈ శ్రీనివాసులు, ఆర్డీవో జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాలపై చర్యలు తీసుకోవాలి
నిత్యావసరాలు పక్కదోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో చౌకధరల దుకాణాలలో అక్రమాలు జరగకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైసు మిల్లులు చౌక దుకాణాల సరుకుల్లో తేడా ఉంటే కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో 30 వేలమందికి ఇంటి నివేసన స్థల పట్టాలు పంపిణీ చేశామని, వారందరికీ ఇల్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పరిస్థితుల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూముల రీసర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసరావు, ఆర్డీవోలు రవీంద్ర, సరోజని, పార్థసారఽథి, తహసీల్దార్లు పాల్గొన్నారు.