వ్యవసాయ, ఉత్పత్తి రంగాలకు రుణాలివ్వాలి
ABN , First Publish Date - 2022-12-29T01:23:51+05:30 IST
వ్యవసాయ, ఉత్పత్తి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు.
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కె.విజయకృష్ణన్
బాపట్ల, డిసెంబరు 28: వ్యవసాయ, ఉత్పత్తి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలివ్వాలని చెప్పారు. ఉత్పత్తి రంగాలు పెరిగితే జిల్లా మరింత అభివృద్ధిలో పయనిస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి రూ.8,304.69 కోట్లు రుణాలివ్వాలనే లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలన్నారు. గడిచిన ఆరు నెలలకు కేవలం రూ.3,189.69 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. వేల సంఖ్యలో కౌలు రైతులు ఉండగా 35 వేల మందికి సీసీఆర్సీ కార్డులు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. అర్హులైన రైతులకు కార్డులు జారీ చేసి పంట రుణాలివ్వాలన్నారు. ప్రాధాన్య రంగాలకు రూ.16.391.39 కోట్ల రుణాలివ్వాలనే లక్ష్యం తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. ఇప్పటి వరకు రూ.9,301.33 కోట్లే రుణాలుగా ఇచ్చారన్నారు. సమావేశంలో జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎల్డీఎమ్ కృష్ణనాయక్, ఆర్బీఐ ఏజీఎమ్ శరత్చంద్, యూబీఐ రీజనల్ హెడ్ కె.అరుణసరిత, డిప్యూటీ రీజనల్ హెడ్ జైజీవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళమార్ట్లను ఏర్పాటు చేయాలి
జిల్లాలో సంక్రాంతి నాటికి మహిళా మార్ట్లను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాఽధిహామీ, డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో కలెక్టర్ ప్రసంగించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో రూ.500 కోట్ల బ్యాంక్ లింకేజి రుణాలు పంపిణీ చేశామన్నారు. మండలానికి 100 పాడి గేదెలు మంజూరు చేయాలని లక్ష్యంగా ఇచ్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద లక్ష్యం మేరకు కూలీలకు పనిదినాలను కల్పించాలన్నారు. జనవరి 15 నాటికి మంజూరు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ బి.అర్జునరావు, డ్వామా పీడీ వై.శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.